క్యాపిటల్ వార్..నేడే మహా ప్రదర్శన..43వ రోజు రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు
రాజధాని అమరావతి కోసం పోరాటం కొనసాగుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుండే పాలన సాగించాలని మొండిగా వ్యవహరిస్తున్న క్రమంలో ఆందోళనలు ఉధృత రూపం దాలుస్తున్నాయి. నేడు రాజధాని గ్రామాల ప్రజల మహా ప్రదర్శన ద్వారా రాజధాని అమరావతి ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజెయ్యాలని నిర్ణయించారు . ఈ క్రమంలో రాజధాని గ్రామాలను రైతులు, రైతు కూలీలు, మహిళలు చుట్టి రానున్నారని, నేడు రాజధాని గ్రామాల్లో దీక్ష శిబిరాలు ఉండవని ప్రకటించారు.
నేడు రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన
మహా ప్రదర్శన కోసం ట్రాక్టర్లు, బైకులు ఇతర సాధనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ మహా ప్రదర్శనలో అమరావతి 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గోవాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు . మహాప్రదర్శనలో అయిదేళ్ల బాలుడు నుంచి 90 ఏళ్ల వృద్ధులు కూడా పాల్గొంటారని బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహా ప్రదర్శన జరుగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే మహాప్రదర్శన కొనసాగించనున్నారు.
43వ రోజు కొనసాగుతున్న నిరసనలు
మహా ప్రదర్శన ద్వారా రాజధాని గ్రామాల్లో ఉద్యమానికి కొత్త ఊపు వస్తుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు. 43వ రోజు నిరసనలు హోరెత్తనున్నాయి. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు. నిన్నటికి నిన్న రాయపూడిలో రైతులు జల దీక్ష చేపట్టారు. వృద్ధులు, మహిళలు అని తేడా రాజధాని అమరావతి కోసం పోరాటం సాగిస్తున్నారు.
పూజలు, చాలీసా పారాయణలు చేస్తున్న మహిళలు
అమరావతి కోసం రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని, సీఎం జగన్ మనసు మారాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.రాజధాని రైతులకు మద్దతుగా వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు అమరావతి రైతులకు బాసటగా నిలుస్తున్నారు.
అమరావతి రైతులకు పెరుగుతున్న మద్దతు .. ఉధృతం అవుతున్న పోరు
ఎన్నారైలు సైతం సంఘీభావం తెలిపారు. నిధులు సమకూర్చడం ద్వారా ఉద్యమానికి తమ వంతు సాయం చేస్తామని చెప్పారు. ఇక కర్ణాటక ప్రాంత రైతులు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మద్దతు దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తుంటే రాజధాని అమరావతి జేఏసీ మాత్రం రోజుకో కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఇన్ని రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపు విషయంలో చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుందని తాజా పరిణామాలతో తెలుస్తుంది.