ఉధృతం అవుతున్న రాజధాని ఉద్యమం ... 20 న గుంటూరు జిల్లాలో జైల్ భరో
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి గ్రామాల ప్రజలు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. రాజధాని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ రాజధాని రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు ఇప్పటికే ఉధృతంగా పోరాటం సాగిస్తున్నారు. ఈ సారి సంక్రాంతి పండుగ కూడా జరుపుకోకుండా రాజధాని కోసం పోరుబాట పట్టారు . నేడు భోగి రోజున కూడా అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
20 న గుంటూరు జిల్లాలో జైల్ భరో కార్యక్రమం
ఇక 20 వ తేదీన క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రోజున హైపవార్ కమిటీ నివేదికపై ఒక నిర్ణయానికి వచ్చి రాజధాని విషయంలో ఫైనల్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఈ నేపధ్యంలో ఏపీ రాజధాని అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఈనెల 20న జైల్భరో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు .
జగన్ రాజధాని విషయంలో నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్న జేఏసీ
సీఎం జగన్ రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి రైతులకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం చేసే పోరాటంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. రాజధాని ఉద్యమం పట్ల పోలీసుల వైఖరి సరిగా లేదన్నారు .
మూడు రాజధానుల రెఫరెండంతో జగన్ ఎన్నికలకు వెళ్ళాలన్న టీడీపీ
ఇక నేడు బీసీజీ గ్రూప్ రిపోర్టుతో పాటు జీఎన్రావు కమిటీ రిపోర్టును టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాగంటి బాబులు భోగి మంటల్లో వేశారు. మాగంటి బాబు ముగ్గు వేశారు. ఇంట్లో పనికిరాని వస్తువులను బోగి మంటలలో వేయడం సంప్రదాయమన్నారు. రాష్ట్రానికి పనికిరాని రిపోర్టులను బోగి మంటల్లో వేస్తున్నామన్నారు. సీఆర్డీయే చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేయాలనుకుంటే టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. హైకోర్టు ఇంటీరియమ్ ఆర్డర్లు ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టని పేర్కొన్నారు. మూడు రాజధానుల రెఫరెండంతో జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.