క్యాపిటల్ వార్..పాలకొల్లులో టీడీపీ ప్రజా బ్యాలెట్..అమరావతికి మద్దతుగా ముగ్గులేసిన పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో 30వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ ఉధృతంగా సాగుతుంది. రాజధాని రైతులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుంది. కానీ రాజధాని ప్రాంత రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మరే చర్చలు అవసరం లేదని రాజధాని పోరాటం సాగిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీడీపీ కూడా ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేస్తుంది.
పాలకొల్లులో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్న టీడీపీ
రాజధానిగా అమరావతి కొనసాగించాని ప్రజల మద్దతు కూడగడుతున్న టీడీపీ ఈ రోజు అమరావతిని రాజధానిగా కొనసాగించాలా.. లేదంటే మూడు రాజధానులు కావాలా..? అనే అంశంపై టీడీపీ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఈ రోజు ఉదయం ప్రజా బ్యాలెట్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యటమే కాదు అమరావతికి మద్దతుగా ప్రజల సహకారానికి ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు .
సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ముగ్గులేసిన సునీత
ఇక మరో వైపు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత అమరావతికి మద్దతు తెలియజేశారు. సేవ్ అమరావతి... సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి పరిటాల సునీత తన సంఘీభావం తెలిపారు. అమరావతికి మద్దతు ఇస్తూ రాప్తాడు నియోజకవర్గం వెంకటాపురంలో తన ఇంటి ముందు ముగ్గులు వేశారు. "సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్" అంటూ పరిటాల కుటుంబసభ్యులు ముగ్గులు వేసి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్ష
ఇక నేడు రాజధాని అమరావతి గ్రామాల్లోనే కాదు గుంటూరులోనూ రాజధాని అమరావతి కోసం ఆందోళనలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టరేట్ ఎదుట రాజధాని రైతులకు మద్దతుగా దీక్ష నిర్వహిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతిలో సైతం ఈ సారి పండుగకు దూరంగా ఆందోళనలు చేస్తున్నారు అమరావతి రైతులు . సేవ్ అమరావతి సేవ్ ఏపీ నినాదంతో ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు .