రాత్రి ఆడి కారు బీభత్సం, అందులో యువతి, యవకుడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగార్జున సర్కిల్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఓ కారు విధ్వంసం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో అతివేగంగా దూసుకు వచ్చిన ఆడి కారు.. రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం సమయంలో కారులో ఓ యువతి, యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంగా కారు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువతి, యువకుడు కారు వదిలేసి పరారయ్యారు. వారు మద్యం మత్తులో ఉండవచ్చునని భావిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కారు బీభత్సం
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనాల పైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరిద్దరికి గాయాలయ్యాయి.
మహిళ గొంతు కోశారు
రంగారెడ్డి జిల్లా షాపూర్ నగర్ మార్కెట్లో మహిళ పైన దుండగుడు దాడి చేసి కత్తితో మహిళ గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.
కాల్వలో పడి బాలికల మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం పరవాడపాలెంలో ఇద్దరు విద్యార్థినీలు ఏలురు కాల్వలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందారు.