షాక్: ఎంపీ మాగంటి ఆఫీసులోనే పేకాట దందా, కోట్లలో వ్యాపారం
కృష్ణా: జిల్లాలోని కైకలూరులో పేకాట దందా జోరుగా సాగుతోంది. ఏకంగా అధికార టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో ఈ దందా సాగుతుండటం గమనార్హం. పేకాటలో ఓడిపోయిన వారి నుంచి ఆస్తులు రాయించుకుని ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.
కోట్ల రూపాయల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో మందు, విందు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో.. ఆయన అండతోనే ఈ దందా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా తమ వాహనాలను పేకాట ఆడే ప్రాంతానికి దూరంగా పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారానికే కోట్ల రూపాయల్లో సాగే ఈ దందాలో పింక్, ఎల్లో, గ్రీన్ కాయిన్స్నే డబ్బు పరిగణిస్తున్నారని సమాచారం. కాగా, నాలుగు రోజుల క్రితం మాగంటి బాబు ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు తెలిసింది.
క్రికెట్ బుకీలు, ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులు సహా ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పేకాట రాయుళ్లు ఇక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ పేకాట దందా వీడియోలు బయటికి రావడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.