కేసీఆర్పై వ్యాఖ్య: టీడీపీ పేజీ ఫేస్'బుక్', బెదిరించొద్దని..
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీ పైన హైదరాబాదులోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును హిట్లర్తో పోల్చుతూ ఫేస్బుక్లో ఫోటో పెట్టారని పలువురు ఫిర్యాదు చేశారు.
టీడీపీ పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో కేసీఆర్ ఫోటోను పెట్టి, హిట్లర్తో పోల్చినట్లుగా తెలుసుకున్న కొందరు నియోజకవర్గ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఐఎన్ఎస్ అభ్యంతరం
మీడియా పైన కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యల పట్ల ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తికైన ప్రచురణల వల్ల ఇబ్బంది కలిగితే అందుకు చట్టపరమైన పరిష్కారాలు ఉన్నాయని గురువారం పేర్కొంది.
కానీ కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్న బెదిరింపులకు ప్రజాస్వామ్య సమాజంలో చోటు లేదని, అదీ ఉన్నతస్థానంలో ఉన్నవారు అలాంటి బెదిరింపులకు పాల్పడటం సరికాదని పేర్కొంది. తమ సొసైటీలో సభ్యత్వం ఉన్న పత్రికలను బెదిరించినా, వేధించినా ప్రతిఘటిస్తామని స్పష్టం చేసింది.