మంత్రి పేర్నినాని అనుచరుడి హత్య కేసులో ట్విస్ట్..మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైసిపి మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. టిడిపి నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్ర ఉందని కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 109 సెక్షన్ కింద కేసు నమోదు అయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ జరపనున్నారు పోలీసులు.
మోకా భాస్కర్ రావు హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ
వైసీపీ నాయకుడైన మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన పాత్రపై కూడా విచారణ జరుపుతామని పేర్కొన్నారు. మచిలీపట్నం డిఎస్పి మహబూబ్ బాషా రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన సమావేశంలో ఈ హత్యా కేసుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చింత నాంచారయ్య అలియాస్ చిన్ని ,చింత నాంచారయ్య అలియాస్ పులిగాడుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఇక వీరితో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి కీలక సమాచారం రాబట్టినట్లుగా పేర్కొన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రపైనా విచారణ
ఈ హత్య తామే చేసినట్టు అంగీకరించినట్లుగా వారు చెప్పారని, మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద గత నెల 29వ తేదీన మోకా భాస్కరరావు కత్తులతో పొడిచి చంపినట్లుగా అంగీకరించారని డీఎస్పీ వెల్లడించారు . మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రపైనా విచారణ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో మాజీమంత్రి కొల్లు రవీంద్రను నిందితునిగా ఎఫ్ఐఆర్లో చేర్చడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
హత్య తర్వాత టీడీపీ నాయకులతో ఫోన్ సంభాషణ
హత్య జరిగిన తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న చింతా చిన్ని, టీడీపీ నాయకులు రిజ్వాన్, నాగరాజు మధ్య ఫోన్ సంభాషణ జరగడంతో ఈ ఇరువురిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. మోకా భాస్కర్ రావును హత్య చేస్తే ఆ తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర అమ్మకు అభయమిచ్చి నట్లుగా నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లుగా సమాచారం.
టీడీపీ ప్రేరేపిత రాజకీయ హత్యనా ? విచారణ
హత్య తర్వాత నిందితులు టిడిపి నాయకులకు ఫోన్ చేసి మాట్లాడటంతో ఇది టిడిపి ప్రేరేపిత రాజకీయ హత్యనా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కేసు నమోదు కావడం టిడిపి నాయకులలో ఆందోళనకు కారణం అవుతుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు , కుంభకోణాలలో చిక్కుకుని విలవిలలాడుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు ఇలా హత్యా నేరాలు కూడా మీద పడటం మింగుడు పడటం లేదు. టీడీపీకి ఇప్పుడు తాజా పరిణామాలు తలనొప్పిగా మారాయి .