నిన్న కొడుకు.. నేడు కూతురు.. బయటకొస్తున్న 'కే' ట్యాక్స్ బాధితులు.. కోడెల కుమార్తెపై కేసు నమోదు..
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల కుటుంబం దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోడెల కుమారుడు శివరామ్ చేసిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే కేసు నమోదుకాగా... తాజాగా ఆయన కూతురు అవినీతి భాగోతం బట్టబయలైంది. భూ కబ్జాతో పాటు కే ట్యాక్స్ వసూలు కోసం ఓ మహిళను బెదిరించడంతో పాటు దాడి చేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు.
హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!
విలువైన భూములపై కన్ను
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కోడెల శివప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మి విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. భూమి యజమానులను బెదిరించి రూ.15లక్షల మేర కే ట్యాక్స్ వసూలు చేశారు. మరో రూ. 5లక్షలు ఇవ్వాలంటూ వేధించడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. గుంటూరు జిల్లా నరసారావుపేట రామిరెడ్డి పేటకు చెందిన పద్మావతికి కేసానుపల్లి వద్ద ఎకరం పొలం ఉంది. 2002లో ఆమె ఆ భూమి కొనుగోలు చేసింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక విలువైన ఆస్తులు, భూములపై కన్నేసిన కోడెల సంతానం లేని వివాదాలు సృష్టించారు. వివాదం పరిష్కారిస్తామంటూ కే ట్యాక్స్ వసూలు చేశారు.
భూకబ్జా యత్నం
రెండేళ్ల క్రితం విజయలక్ష్మి అనుచరులు బాధితురాలు పొలం వద్దకు వెళ్లి భూ యజమానులను బెదిరించారు. నకిలీ పత్రాలు చూపించి పొలాన్ని కోడెల కుమార్తె విజయలక్ష్మి కొనుగోలు చేసిందని, భూమి జోలికివస్తే చంపేస్తామని బెదిరించారు. సమస్య పరిష్కారం కావాలంటే కే ట్యాక్స్ చెల్లించాలని హుకుం జారీ చేశారు. దీంతో బాధితురాలు, విజయలక్ష్మి వద్దకు వెళ్లగా రూ.20లక్షలు చెల్లించాలని, లేనిపక్షంలో పొలం తమకు విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు విడతలవారీగా 15లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం మూడు విడతల్లో రూ.15లక్షలు చెల్లించారు.
పోలీసులకు బాధితుల ఫిర్యాదు
ఒప్పందం ప్రకారం రూ.15 లక్షలు చెల్లించినా విజయలక్ష్మి మాత్రం బాధితుల్ని వదలిపెట్టలేదు. గత జనవరిలో మరో ఐదు లక్షలు చెల్లిస్తేనే పొలంలోకి అడుగుపెట్టనిస్తామని, లేనిపక్షంలో చంపేస్తామని ఆమె అనుచరులు బెదిరించడంతో వారు ఆ డబ్బు చెల్లించలేక మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల క్రితం పద్మావతి, ఆమె భర్త పొలం వద్దకు వెళ్లగా.. కోడెల కుమార్తె అనుచరులు శ్రీనివాసరావు, రాంబాబులు మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విజయలక్ష్మి, ఆమె అనుచరులు కల్యాణం రాంబాబు, శ్రీనివాసరావుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.