బాలికలతో వెట్టిచాకిరీ.. బాడీ మసాజ్.. టీవీ యాంకర్ నిర్వాకం
హైదరాబాద్లో దారుణం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలతో వెట్టిచాకిరీతో పాటు బాడీ మసాజ్ చేయించుకుంటున్న ఓ టీవీ యాంకర్ నిర్వాకం బయటపడింది. ఆ బాలికలను ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్(CCI)విద్యార్థులుగా గుర్తించారు. ఇటీవల చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్ నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయినట్టుగా సీడబ్ల్యూసీ(Child Welfare Committee) అధికారులకు ఫిర్యాదు అందడంతో.. దానిపై దర్యాప్తు చేయగా హైదరాబాద్లోని టీవీ యాంకర్ ఇంట్లో వారిని గుర్తించారు.
కాగా,సీసీఐలో చదువుకుంటున్న ఆ విద్యార్థులను సంక్రాంతి పండగ సెలవుల నిమిత్తం తల్లి హైదరాబాద్కు తీసుకెళ్లింది. ఆపై అక్కడే ఓ టీవీ యాంకర్ ఇంట్లో బాలికలను పనికి కుదిర్చింది. సెలవులు ముగిసి చాలారోజులు అయినప్పటికీ బాలికలు చైల్డ్ కేర్కి రాకపోవడంతో సీడబ్ల్యూసీ అధికారులకు ఫిర్యాదు అందింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. హైదరాబాద్లోని ఓ టీవి యాంకర్ ఇంట్లో బాలికలు పనికి కుదిరినట్టు గుర్తించారు. దీనిపై నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికలను పనిలో పెట్టుకోవడంపై వారిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టరీత్యా మైనర్లతో పనిచేయించుకోవడం నేరం కాబట్టి సదరు యాంకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.