ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన..టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగగా, ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని బృందావన్ అపార్ట్మెంట్ లో జెసి సమీప బంధువు, టౌన్ బ్యాంకు ఉద్యోగి అయిన గౌరీ నాథ్ రెడ్డి కి సంబంధించిన పెంట్ హౌస్ లో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ క్రికెట్ కిట్లు టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి, వారికి పంచడానికి తీసుకు వచ్చిన కిట్లుగా గుర్తించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పై 188, 171 ఇ హెచ్, సెక్షన్ల క్రింద తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాత్రమే కాకుండా, క్రికెట్ కిట్ లను పెట్టుకోవడానికి పెంట్ హౌస్ ఇచ్చిన జెసి సమీప బంధువు గౌరీ నాథ్ రెడ్డి పైన కూడా శుక్రవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జేసీ వర్గీయులు మాత్రం ఇదంతా వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత చర్యగా చెప్తున్నారు. టిడిపి నేతలను ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడం కోసం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.