తాడిపత్రి ఘర్షణలు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు బుక్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రయోగం
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో.. కేసు నమోదుల పర్వం ఆరంభమైంది. ఈ ఘర్షణకు కారణమైన కొందరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంంలోని సెక్షన్ 307 కింద జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టారు.
Recommended Video
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఈ ఘర్షణకు దారి తీసింది. తన భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులనని భావించిన కేతిరెడ్డి.. నేరుగా ఆయన ఇంటిపైకి దాడి చేశారు. తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తు జేసీ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గానీ, ఆయన అనుచరులు, కుటుంబీకులు గానీ ఇంట్లో లేరు. దీనితో వారు అక్కడే కాపు కాశారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ అనుచరులు.. కేతిరెడ్డి వర్గంపై ప్రతిదాడులకు దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
దీనితో కొన్ని గంటల పాటు తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. దాడులు ప్రతిదాడులతో అట్టుడికిపోయింది. ఈ ఘటన అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 144 సెక్షన్ విధించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కేతిరెడ్డి అనుచరులపైనా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా- శుక్రవారం జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయుల ఫిర్యాదు మేరకు జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనలో తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.