మద్యం ధరల పెంపు.. తిరుమల లడ్డు ధరల పెంపు .. పోల్చిన చంద్రబాబు ... కేసు నమోదు
Recommended Video
ఏపీ రాజకీయాలు తిరుమల తిరుపతి వెంకన్న చుట్టూ తిరుగుతున్నాయి. టీటీడీలో డిక్లరేషన్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో రేగిన దుమారం ఏపీలో ఇంకా సద్దుమణగలేదు. ఇక తాజాగా వైసీపీ పాలన తీరుపై విమర్శలు గుప్పించిన, కొడాలి నాని వ్యాఖ్యలపై విరుచుకుపడిన చంద్రబాబు తిరుపతి లడ్డు ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో మద్యం ధరలను, అలాగే తిరుపతి లడ్డు ధరలను పెంచటంపై ప్రభుత్వ విధానాలను పోల్చి మాట్లాడారు. ఇక ఈ వ్యాఖ్యలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
డిక్లరేషన్ గురించి మాట్లాడితే... ఇంకా ఎక్కువ తిడతా... కొడాలీ నాని
టీటీడీ కేంద్రంగా ఏపీలో వివాదాలు .. కొడాలి నానీ పెట్టిన చిచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ వేదికగా రాజకీయ దుమారం రేగింది. పార్టీలన్నీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి చూపిస్తూనే ఆ స్వామి కేంద్రంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని , టిటిడి ఎవడి అమ్మ మొగుడు నిర్మించలేదని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిజెపి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.
వైసీపీని ఇరకాటంలో పెడుతున్న ప్రతిపక్షాలు ..
తిరుమలలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందని,అన్య మతస్థులు ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి ఆలయం లోపలికి వెళ్లాల్సిందేనని ఫైర్ అయ్యారు. అంతే కాదు మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తప్పని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసులు సైతం పెట్టి వైసిపిని ఇరకాటం లో పెట్టారు. ఇక తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన చంద్రబాబు కొడాలి నాని టిటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
మద్యం ధరలపెంపుకు లడ్డు ధరల పెంపుకు పోలిక చెప్తూ చంద్రబాబు వ్యాఖ్యలు
అంతేకాకుండా ఏపీలో మద్యపానాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో విపరీతంగా మద్యం ధరలు పెంచారని, తద్వారా మద్యం తీసుకునే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావించినట్లుగా మాట్లాడారు చంద్రబాబు.ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వసతి గదుల అద్దె రేట్లను పెంచడం, లడ్డూ ధరలను పెంచడం తిరుమలకు వచ్చే భక్తులను రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే అంటూ వ్యాఖ్యలు చేశారు. మద్యం ధరలను పెంచటం మద్యం తాగేవారిని నియంత్రించటానికి అయితే, లడ్డూ ధరలను,వసతిగదుల అద్దెలను పెంచటం తిరుమలకు వచ్చే భక్తులను నియంత్రించటానికి అంటూ లాజిక్ మాట్లాడారు .
తిరుపతి పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై కేసు నమోదు
దీంతో మద్యాన్ని, తిరుమల లడ్డూతో పోల్చడంపై ఆయనపై తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారని ఆయనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రతి వివాదం లోను టీటీడీని లాగి తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారని, తిరుమలలో అప్రతిష్టపాలు చేస్తున్నారని చాలా మంది భక్తులు భావిస్తున్నారు. టిడిపి, వైసిపి, బిజెపీలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో టీటీడీ ని వివాదాస్పదం చేయడం బాగా లేదని చాలా మంది భక్తులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ టీటీడీకి సంబంధించిన వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయంలో టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి .