కొవ్వూరు, జనవరి 2: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ తమపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ టీడీపీకి చెందిన కార్యకర్తలు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. టిడిపికి చెందిన మంత్రి పై ఇలా తెలుగుదేశం పార్టీకే చెందిన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది.
ఈ ఫిర్యాదుకు దారితీసిన పరిస్థితులు ఇవి...బీర్ హెల్త్ డ్రింక్ అంటూ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలపై ఫేస్ బుక్ ,వాట్సాప్ లో వచ్చిన కామెంట్లను టీడీపీ ఎఫ్బీ, వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది షేర్ చేశారు. వీటికి బాధ్యులుగా పేర్కొంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులోని కొంతమంది నెంబర్లను కొవ్వూరు పోలీసులకు ఇచ్చి మంత్రి జవహర్ పీఆర్వో అప్పట్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు సెక్షన్ 41 నోటీసుపై బలవంతంగా తన సంతకాలు తీసుకున్నారని తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన టీడీపీ కార్యకర్త కాకర్ల సత్యేంద్ర ప్రసాద్ ఆరోపించడం తో వివాదం రాజుకుంది.
మాట్లాడదామని పిలిచి...దాడి చేశారంటూ...
ఈ వివాదం విషయమై మాట్లాడదామని జనవరి ఒకటిన మధ్యవర్తుల సాయంతో తనను ఇంటికి పిలిపించుకున్న మంత్రి జవహర్, తన అనుచరులతో దాడి చేయించారని సత్యేంద్ర ప్రసాద్ సోమవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిని అడ్డుకున్న అన్నదేవరపేట ఉపసర్పంచి కూచిపూడి గణపతికృష్ణపైనా దాడి చేశారని, తమను చంపేస్తామని తీవ్రపదజాలంతో బెదిరించారని సత్యేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి కె.జవహర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని సత్యేంద్ర ప్రసాద్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరో వర్గం...ప్రదర్శన
దీంతో టిడిపిలోని కొంతమందిపై పోలీసు కేసు నమోదయిందని తెలుసుకున్న తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాలకు చెందిన సుమారు టీడీపీ 120 మంది కార్యకర్తలు మంగళవారం ఉదయం టీడీపీ ఆఫీసు నుంచి పట్టణ పురవీధులలో ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు నినాదాలు చేశారు.
మంత్రి కి అనుకూల వర్గం కూడా...
మరోవైపు మంత్రి జవహర్ అనుకూల వర్గం కూడా డీఎస్పీకి ఒక వినతిపత్రం అందజేసింది. ఈ కేసును నిష్ఫాక్షికంగా విచారించి అసలు వాస్తవాలను వెలికితీసి తప్పు చేసిన వారిపై చర్యలు ఈ సందర్భంగా మంత్రి జవహర్ అనుచరులు పోలీసులను కోరారు.
మంత్రి జవహర్...వివరణ...
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనపై మంత్రి జవహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి మాట్లాడేందుకు సత్యేంద్రప్రసాద్ తన ఇంటికి వచ్చారని, అయితే పార్టీ పెద్దలతో రెండో తేదీన చర్చిద్దామని చెప్పి పంపించామన్నారు. పార్టీ జిల్లా పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు పథకం ప్రకారం తనపై బురదజల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తలైతే నేరుగా తన వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు.
RECOMMENDED STORIES