సబ్బంపై కేసు పెడ్తాం, డమ్మీ అభ్యర్థిగా చూస్తాం: ఈసి
హైదరాబాద్: పోటీ నుంచి తప్పుకుంటూ బిజెపికి మద్దతు ప్రకటించిన జై సమైక్యాంధ్ర విశాఖపట్నం లోకసభ అభ్యర్థి సబ్బం హరిపై కేసు పెడ్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. ప్రచార ఘట్టం ముగిసిన నేపథ్యంలో బిజెపికి మద్దతు తెలపడం ద్వారా సబ్బం హరి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భన్వర్ లాల్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయం చెప్పారు.
సబ్బం హరిని డమ్మీ అభ్యర్థిగా పరిగణిస్తామని, సబ్బం హరి పెట్టిన ఖర్చును ప్రధాన అభ్యర్థి వ్యయంలో జత చేస్తామని ఆయన చెప్పారు. డబ్బులు ఇచ్చినవారే కాదు, తీసుకున్న వారు కూడా నేరస్థులేనని ఆయన అన్నారు. మద్యం, నగదు, బహుమతులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అని ఆయన అన్నారు. కులం, మతం వంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఓటు హక్కును నివోయిగించుకోవాలని ఆయన సూచించారు. సీమాంధ్రలో బుధవారంనాడు 85 నుంచి 90 శాతం పోలింగ్ జరగవచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సందర్భంగా పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపడుతామని భన్వర్ లాల్ చెప్పారు. ప్రలోభాలాతో తాత్కాలికంగా ఎన్నికైనా ఎన్నికల చట్టాల ప్రకారం శిక్ష తప్పదని ఆయన అన్నారు. ఓటరు స్లిప్పులు లేకున్నా ఓటర్ల జాబితాలో పేరుంటే ఓటు వేయవచ్చునని ఆయన చెప్పారు.