వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు: చంద్రబాబుకు స్వర పరీక్ష, ఇరికించేందుకు యత్నం?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తుని వేగవంతం చేసింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్రపైనా దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఏసీబీ మెమో కూడా దాఖలు చేసింది.

ఓటుకు నోటు: మీ వల్లే ఇబ్బందులు, చిందులు తొక్కిన చంద్రబాబు

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వర పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఏసీబీ ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 5 కోట్లు లంచం ఇవ్వచూపిన కేసులో సీఎం చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు స్వయంగా బేరసారాలు నడిపినట్లు ఆడియో టేపులు వెలుగు చూశాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడిన వాయిస్‌పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) గతంలోనే నివేదిక అందజేసింది.

ఆ వాయిస్ నిజమైనదే అని, ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు తాజాగా అందులో ఉన్న స్వరం ఏపీ సీఎం చంద్రబాబుదేనని తాజాగా ముంబైకి చెందిన ఒక ల్యాబ్ నివేదిక బయటపడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Cash-for-vote: ACB to probe 'Naidu voice sample' again

ఈ క్రమంలో మంగళగిరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ను విచారించిన ఏసీపీ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబుకు స్వర పరీక్షలు నిర్వహించాలని ఏసీబీ భావిస్తోంది. ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టుతో పాటు కేసు తీవ్రత దృష్ట్యా ఎఫ్‌ఎస్‌ఎల్ చేత మరోసారి పరీక్షలు జరిపించాలని నిర్ణయించింది.

దీని కోసం త్వరలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని ఏసీపీ భావిస్తోందని అధికారులు అంటున్నారు. నిజానికి ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు స్వర పరీక్షలు జరిపించాలని ఏడాది కిందటే ఏసీబీ భావించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సాగించిన సంభాషణ వాస్తవమైనదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ గతంలోనే నిర్ధారించిన సంగతి తెలిసిందే.

అయితే గత కొంతకాలంగా ఈ కేసు నెమ్మదించింది. తాజాగా కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఏసీబీ, చంద్రబాబుకు ఇప్పుడు స్వరపరీక్షను పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా చంద్రబాబుకు నోటీసులను అందచేయాలని, వాటికి ఆయన స్పందించకపోతే ఆయన స్వరనమూనాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తీసుకోవాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఓటుకు నోటు కేసులో గతేడాది దాఖలుచేసిన చార్జిషీట్‌లోనూ 33సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించింది. దీనితో ఏ విధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి, నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29లోపు అందించాల్సి ఉంటుందని అంటున్నారు.

మరోవైపు, చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్న అధికారి తమతో అన్నట్లుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారని పేర్కొంది.

ఓటుకు నోటు కేసుపై ఉత్కంఠ: ఏం జరుగుతోంది, చంద్రబాబు ప్లాన్ ఏంటీ?

చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందన్నారు. సీఆర్పీసీ ప్రకారం అరవై ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు, దర్యాప్తు సంస్థ వద్దకు పిలువడం కుదరదని చెప్పారని పేర్కొన్నారు.

దీంతో నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం కూడా ఉంటుందని సదరు అధికారి చెప్పారని పేర్కొన్నారు.

English summary
ACB court in Hyderabad has directed Telangana ACB to investigate and submit a report on a private forensic laboratory’s report on the cash-for-vote case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X