'కొత్త వాదన'కు కౌంటర్!: 'గొంతు బాబుదే, శాంపిల్కు సహకరించకుంటే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో మాట్లాడినట్లు పేర్కొంటూ రెండు చానళ్లలో ప్రసారమైన ఆడియో క్లిప్పింగుల గుట్టు విప్పేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారని, ఆ ఆడియో కట్ అండ్ పేస్ట్ అని మీడియాలో వార్తలు వచ్చాయి.
దీనిపై కేసీఆర్కు చెందిన నమస్తే తెలంగాణ కౌంటర్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మెడకు ఉచ్చు మరింత బలంగా బిగుసుకుంటున్నదని, ఈ కేసులో దొరికిన ఆడియోలో వినిపించింది చంద్రబాబు గొంతేనని ఫొరెన్సిక్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోందని పేర్కొంది.
అలాగే బాబు ఆడియో, రేవంత్ వీడియో రెండింటిలోనూ ఏ రకమైన కట్ పేస్ట్లు లేవని కూడా వారు గుర్తించినట్టు తెలిసిందని, తెలంగాణ ఫోరెన్సిక్ అధికారులు హై డిజిటల్ టెక్నాలజీలో వీటిని విశ్లేషించారని, ఈ మేరకు ప్రాథమిక విచారణ పూర్తి అయినట్టు తెలిసిందని పేర్కొంది.
ఒకటి రెండు రోజుల్లో మిగిలిన విశ్లేషణ పూర్తిచేసి ఏసీబీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారమని కూడా పేర్కొంది. దర్యాఫ్తు అవసరాల దృష్ట్యా ఈ ఆడియో, వీడియోల్లో ఏదైనా ఎడిట్, కాపీ, పేస్ట్ లాంటి అంశాలు ఉన్నాయా అనే కోణంలో నివేదిక ఇవ్వాలని ఏసీబీ కోరిందని రాసింది.
ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే 90 శాతం పూర్తి చేశారని, మరో రెండురోజుల్లో మొదటి దశ ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందచేస్తారని రాసింది. ఇదిలా ఉండగా, చంద్రబాబు వాయిస్ టెస్ట్ తప్పనిసరి కానుందని రాసింది. ఈ వారంలో బాబుకు వాయిస్ టెస్ట్ కోసం నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు పేర్కొంది.
వాయిస్ టెస్టుకు సహకరించకుంటే వివిధ సందర్భాల్లో బాబు మాట్లాడిన ఆడియో, వీడియోలు, అలాగే గతంలో అసెంబ్లీలో మాట్లాడిన టేపులను అధికారులు సేకరిస్తారని, వాటిని ఫోన్ సంభాషణలో బాబు మాట్లాడిన ప్రతి మాటతో మైక్రో లెవల్స్ స్థాయి నుంచి డిజిటల్ టెక్నాలజీతో విశ్లేషిస్తారని, అదే విధంగా అరస్టైన నిందితుల వీడియోలోని వ్యాఖ్యలను మరోసారి నిందితులతో మాట్లాడించి వాటిని నిర్దారిస్తారని పేర్కొంది.
ఒకవేళ బాబు వాయిస్ టెస్ట్కు హాజరైతే ఆడియోలో ఆయన స్టీఫెన్సన్తో మాట్లాడిన మాటలను తిరిగి మరోసారి పలికించి రికార్డు చేస్తారని, ఈ కేసులో సాక్షులుగా ఉన్న స్టీఫెన్సన్తో పాటు ఆయన స్నేహితుడు, కూతురు వాయిస్ రికార్డులను కూడా రికార్డు చేస్తారని పేర్కొంది.