ఓటుకు నోటు: ఈసీ పరిధిలోకే, ఏసీబీ ఊడిగం చేస్తోందన్న జూపూడి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్వవహారంలో దర్యాప్తుని కొనసాగించాలని ఈసీ (ఎన్నికల కమిషన్) లేఖ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ తప్పబట్టారు. ఈ అంశంపై బుధవారం ఆయన సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిషికేషన్ వచ్చిన తర్వాత ఏసీబీ పాత్ర ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ను పూల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాట వినని ఎమ్మెల్యేలను కేసుల్లో ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల కమిషన్ను మేం సంప్రదించామని, వాళ్లు పట్టుుకన్న తర్వాతే మాకు ఫోన్ చేశారని ఈసీ లేఖలో తెలిపిందని జూపూడి తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే అటు వైయస్ఆర్ కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసు ముమ్మాటికి ఈసీ పరిధిలోకి వస్తుందని, ఏసీబీ కిందకి రాదని మరోసారి జూపూడి స్పష్టం చేశారు. ఈసీ ఎప్పుడు కూడా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరదని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఏసీబీనే చివరి వరకూ దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఈసీ లేఖ పంపిన సంగతి తెలిసిందే.
పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్లాల్ ఈ కేసుకు సంబంధించి పంపిన లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిస్పందిస్తూ తాజా లేఖ పంపింది. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోలేమి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తన లేఖలో స్పష్టం చేసింది.