ఓటుకు నోటు.. మత్తయ్యకు ఛార్జీషీట్ కాపీ ఇవ్వండి: హైకోర్టు
విజయవాడ/హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులో జెరూసలేం మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. మత్తయ్యకు ఛార్జీషీట్ వివరాలు అందించాలని హైకోర్టు శుక్రవారం నాడు పోలీసులను ఆదేశించింది.
ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది శుక్రవారం నాడు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. ఛార్జీషీట్ కాపీ ఇవ్వాలని ఆదేశించింది. ఇన్ కెమెరా ప్రొసీడింగులో విచారణ జరిగింది.
కాగా, ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొద్ది నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో టిడిపి, ఫోన్ ట్యాపింగ్ కేసులో టిఆర్ఎస్ చిక్కుల్లో పడినట్లుగా జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ రెండు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. టిఆర్ఎస్, టిడిపిలు ఈ అంశాలపై వాగ్యుద్ధానికి దిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల యుద్ధానికి దిగారు. అనంతరం కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుటి కేసు విషయమై ఆయనను సిబిఐ ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు... కెసిఆర్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు.