ఎపి వర్సిటీలపై కుల నీడలు: రిషితేశ్వరి నుంచి రోహిత్ దాకా..
విజయవాడ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రిషితేశ్వరి ఆత్మహత్యను గుర్తు చేస్తున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కుల వివాదం ప్రధానంగా తెర మీదికి వచ్చింది.
ప్రిన్సిపాల్ బాబూరావుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. రోహిత్ వేముల ఆత్మహత్య ఆ చర్చను మరోసారి ముందుకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కులవివాదాలు సర్వసాధారణంగా మారాయి. కుల రాజకీయాల కారణంగా విద్యార్థులు బలవుతున్నారని అంటున్నారు.
1976లో ఏర్పడిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి మంచి పేరు ఉండేది. కానీ కుల రాజకీయాలతో అది భ్రష్టుపట్టిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటువంటి కుల రాజకీయాలో హెచ్సియులో నడుస్తున్నాయని అంటున్నారు. ఓ సామాజిక వర్గానికి చెందినవారు విశ్వవిద్యాలయాల్లోని ఉన్నత పదవుల్లో ఉండడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతుందనే వాదన కూడా బలంగానే ఉంది.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం పరిస్థితిని మరింత విషమింపజేస్తోందని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీలకు అనబంధంగా పనిచేసే ఎబివిపి, ఎన్ఎస్యుఐ, టిఎన్ఎస్ఎఫ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో అగ్రవర్ణాల విద్యార్థులకు, దళిత విద్యార్థులకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడిందని చెబుతున్నారు.
అడ్మిషన్ల నుంచి వైస్ చాన్సలర్ వంటి ఉన్నత పదవుల వరకు రాజకీయ జోక్యం అడుగడుగునా విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ స్థితిలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారిందనే అభిప్రాయం ఉంది. ఈ ఘర్షణలకు విద్యార్థులు బలవుతున్నారనే విమర్శ ఉంది.