తక్కువ కులం వారి ముఖం చూడడం ఇష్టం లేక ఏం చేశారంటే
చిత్తూరు :స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటినా గ్రామాల్లో కులాల పేరుతో వివక్ష కొనసాగుతోంది.తక్కువ కులం వారి ముఖం చూడకుండా ఉండేందుకుగాను ఓ ప్రబుద్దుడు బండరాళ్ళను అడ్డుగా పెట్టాడు
శ్రీకాళహాస్తి మండలం కమ్మకొత్తూరులో తక్కువ కులం వారి ముఖం చూడడం ఇష్టం లేక ఓ వ్యక్తి బండలు నాటడం వివాదాస్పదంగా మారింది. సీమల వాసు, కృష్ణవేణి , పెంచలయ్యలు కమ్మకొత్తూరులో నివాసం ఉంటున్నారు. వీరు రజకులు వీరి నివాసాలకు ఎదురుగా ఉన్నవారు అగ్రవర్ణాలకు చెందినవారు.
ఉదయాన్నే తక్కువ కులానికి చెందిన వీరి ముఖాలు చూస్తే అరిష్టమని భావించిన కొందరు రజకుల ఇళ్ళకు వెళ్ళే దారిలో పెద్ద బండరాళ్ళను అడ్డుగా పెట్టారు దీని వల్ల ఎదురు ఎదురుగా ఉన్న వారు కన్పించకుండా ఈ రాళ్ళు అడ్డుగా ఉన్నాయి.
రజకుల ఇళ్ళ వైపుకు వెళ్ళేందుకు ఈ రాళ్ళు అడ్డుగా ఉంటున్నాయి. తక్కువ కులం వారనే ఉద్దేశ్యంతోనే తమను కొందరు దూషిస్తున్నారని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.