చిరంజీవిపై కుల వివక్ష .. కావాలనే దుష్ప్రచారం : జనసేన నేత సంచలనం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నెలకొన్న సినీ రంగ సమస్యలను పరిష్కరించడం కోసం తాజాగా చిరంజీవి నేతృత్వంలో సినీప్రముఖులు భేటీ అయ్యారు. ఇక ఈ భేటీ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని టార్గెట్ చేసి అటు బిజెపి,ఇటు టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చిరంజీవిపై చేస్తున్న విమర్శలు కేవలం కుల వివక్షకు నిదర్శనమని జనసేన నేత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
చిరంజీవిని టార్గెట్ చేసిన సాధినేని యామిని: జగన్ తో చిరు అండ్ టీమ్ భేటీ కేవలం వ్యాపార లావాదేవీలకే !!
జగన్ తో చిరు బృందం భేటీపై ఏపీలో రాజకీయ దుమారం
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి నేతృత్వంలోని బృందం నిన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ దుమారానికి కారణమైంది. చిరంజీవి సీఎం జగన్ ని కలవడానికి వెళ్లిన నేపథ్యంలో గతంలో మూడు రాజధానుల విషయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని అమరావతి ప్రాంత రైతులు ప్ల కార్డులతో చిరంజీవి బృందం ఉన్న గెస్ట్ హౌస్ ముందు నిరసన తెలియజేశారు. ఇక అవేవి పట్టించుకోకుండా చిరంజీవి సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యి షూటింగ్ల నిర్వహణ, థియేటర్ల రీఓపెనింగ్ తదితర అంశాలపై మాట్లాడారు.
అన్నను వెనకేసుకొచ్చిన జనసేన నేత నాగబాబు .. తాజాగా మరో నేత కీలక వ్యాఖ్యలు
ఇక ఈ నేపథ్యంలోనే చిరంజీవి రాజధాని అమరావతి రైతుల గోడును పట్టించుకోవడం లేదని, స్టూడియో భూముల కోసమే సీఎం జగన్ తో భేటీ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులలు సీఎం జగన్ తో భేటీ కావటం రాజకీయ దుమారానికి కారణం అయ్యింది. ఇక ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు తన అన్నకు మద్దతుగా నిలబడి టిడిపి పై విమర్శల వర్షం కురిపించారు. వారికి జగనే కరెక్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ క్రమంలో మరో జనసేన కీలక నాయకుడు బొలిశెట్టి సత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిపై కుల వివక్ష .. అందుకే విమర్శలు చేస్తున్నారన్న జనసేన నేత
చిరంజీవిపై కుల వివక్ష చూపుతున్నారని, చిరంజీవి ముఖ్యమంత్రిని కలిస్తే అది స్టూడియో స్థలం కోసం చేస్తున్న భజన అని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక స్టూడియోల భూముల కోసం నాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, రామానాయుడు ముఖ్యమంత్రులను కలవలేదా? అది కూడా భజనేనా మరి అని సత్య నిలదీశారు. ఇక మెగాస్టార్ చిరంజీవిపై ఎందుకు ఈ కులవివక్ష అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన నేత.
చిరంజీవి విషయంలో విమర్శలపై జనసేన నేతల స్పందనతో రాజకీయ వర్గాల ఆసక్తి
చిరంజీవి విషయంలో జనసేన నేతలు స్పందించటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ కోసం చిరంజీవి పని చేసింది కానీ తమ్ముడు పవన్ ను వెన్ను తట్టి ముందుకు నడిపింది కానీ లేదు . ఇంకా గతంలో సీఎం జగన్ మీద జనసేన అధినేత పవన్ విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో చిరంజీవి సతీసమేతంగా వెళ్లి జగన్ పాలనకు కితాబిచ్చారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో వైసీపీ నేతలు చిరంజీవి జగన్ ను కలిశారని, పవన్ పై సెటైర్లు వేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి విషయంలో జనసేన నేతలు స్పందిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది .