కులగజ్జిని ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స చెయ్యాలి : వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమీషన్ వాయిదా వెయ్యటంతో ఒక్క సారిగా కుల రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవటం ఏపీలో పెద్ద దుమారానికి కారణం అయ్యింది . కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ రమేష్ ప్రకటించారు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులగజ్జితో చంద్రబాబు కోసం పని చేశారని తీవ్రంగా మండిపడ్డారు. అలాగే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పై నిప్పులు చెరుగుతున్నారు.
కుల పంచాయితీగా మారిన స్థానిక ఎన్నికల వివాదం .. తీవ్ర అసహనంలో ప్రజలు
ఇక ఈ క్రమంలో గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు ఎన్నికల కమీషనర్ పై , అలాగే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కుల గజ్జితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్న నేపధ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తక్షణమే 'కులగజ్జిని' కూడా చేర్చి చికిత్స అందించాలని రాష్ట్రం మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రం నుంచి రూ. 5 వేల కోట్లు రాష్ట్రానికి రాకూడదని రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలన్న భావనతోనే ఎన్నికలను తన కులస్తుడైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరితో ఆపించారని ఆయన పేర్కొన్నారు.
ఇక చంద్రబాబునుద్దేశించి ఎన్నికలంటే స్వయం ప్రకాశం లేని అమావాస్య చంద్రుడికి మొదటి నుంచి భయమేనని పిన్నెల్లి వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కేవలం ఒకసారి 2001లో మాత్రమే స్థానిక ఎన్నికలు నిర్వహించారని ఎద్దేవా చేశారు. 2018 ఆగస్టులో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు పెట్టలేదని, ఓడిపోతామనే భయమే ఇందుకు కారణమని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.5 కోట్ల మంది ప్రజలకు చంద్రబాబునాయుడు ద్రోహం చేశారని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అటు ఎన్నికల కమీషనర్ మీద , చంద్రబాబు మీద మాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.