కులం పెట్టిన కుంపటి.. ఉండవల్లి శ్రీదేవికి సినిమా కష్టాలు.. ఈ నెల 26న విచారణ!
అమరావతి/హైదరాబాద్ : అమరావతి రాజకీయాల్లో ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు ఉండవల్లి శ్రీదేవి. భర్త కమ్మెల శ్రీధర్ తెలుగు ప్రజలకు సునరిచితుడైనప్పటికి శ్రీదేవి మాత్రం అంతగా పరిచయం లేని మొహం. 2014లో తెలుగుదేశం పార్టీ తరుపున ఇదే ఉండవల్లిలో ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఆ తర్వాత 2019లో వైయస్సార్ సీపి తరుపున సీటు సాధించి గుంటూరు జిల్లా తాడికొండ నియోజక వర్గం నుండి గెలుపొందారు. అయితే శాసన సభ్యురాలిగా పదవిని పూర్తిగా ఆస్వాదించక ముందే శ్రీదేవికి కులం కుంపటి రాజేసింది. తన కులంపై వివాదం చెలరేగడంతో ఏకంగా రాష్ట్రపతి భవన్లోనే వివరణ ఇచ్చుకునే పరిస్ధితులు తలెత్తాయి. తేడా జరిగితే ఎమ్మెల్యే పదవి కూడా పోయే ప్రమాదం కొని తెచ్చుకున్నారు ఉండవల్లి శ్రీదేవి.
ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి పై విచారణ: ఆధారాలతో రావాలని సమన్లు: గతంలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు..!
శ్రీదేవి.. ఎస్సినా..? క్రిష్టియనా..? శరాఘాతంగా మారిన కులం..
50 సంవత్సరాల ఉండవల్లి శ్రీదేవికి వైద్యురాలిగా ఎంతో గుర్తింపు ఉంది. భర్త కమ్మెల శ్రీధర్ కూడా వైద్యుడే కావడం గమనార్హం. స్వస్థలం గుంటూరులో బాగా ప్రజాదరణ రావటంతో ఇద్దరిలోనూ రాజకీయాలపట్ల ఆసక్తి పెరిగింది. మొదలు 2014లో టీడిపి తరుపున సీటుకోసం తారాస్దాయిలో శ్రమించారు. తర్వాత వైఎస్ జగన్తో టచ్లో ఉంటూ తాడికొండ సీటును సంపాదించుకోగలిగారు. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన ఆమె అయినా క్రైస్తవం స్వీకరించారు. ఈ లెక్కన ఆమె ఎస్సీ కులం కాస్త బీసీ సీ కోటాలోకి మారిపోయింది. ఇకపోతే భర్త కమ్మెల శ్రీధర్ కాపు వర్గానికి చెందిన వ్యక్తి. కులాంతర వివాహంతో ఆదర్శంగా నిలిచారు.
శ్రీదేవి క్రిష్టియన్ అయితే ఎమ్మెల్యే పదవికి ప్రమాదమే.. ఎలా నిరూపించుకుంటారో..?
ఆ తరువాత 2019లో రాజకీయాల్లోకి వచ్చి, ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి విజయం సాదించారు. ఆమె హంగూ ఆర్బాటం, కాన్వాయ్ కూడా రాజధాని ఎమ్మెల్యేకు తగ్గట్టుగానే ఆడంబరంగా మార్చేసుకున్నారు. అసలు చిక్కంతా ఇక్కడే మొదలైనట్టు చర్చ జరుగుతోంది. అసలు తాడికొండ అంటేనే కమ్మ సామాజికవర్గం అధికంగా ఉన్న ప్రాంతం. అటువంటి చోట రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు డొక్కా మాణిక్యవరప్రసాద్. టీడీపీ తరపున 2014లో విజయం సాధించిన శ్రవణ్కుమార్ కూడా, కమ్మ నేతలను పక్కనబెట్టుకుని పాలన సాగించారనే విమర్శలూ లేకపోలేదు. ఎంతైనా అక్కడ గెలిపించేది ఆ ఓటర్లే కావటం, ఎస్సీ రిజర్వ్డ్ కావటంతో తప్పదంటూ నేతలు కూడా పరోక్షంగా ఎస్సీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంటారు.
స్థానికంగా ఎన్నో వివాదాలు.. శ్రీదేవిని ఒంటరి చేసిన లోకల్ పాలిటిక్స్..
2019లో వైసీపి తరుపున శ్రీదేవి గెలవడంతో అక్కడ కమ్మ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు శ్రీదేవి వైద్యురాలు కావటం, ఆమెకు జగన్ వద్ద మంచి గుర్తింపు ఉండటం పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వినాయకచవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవిని కొందరు అన్యమతస్తురాలంటూ దూరంగా ఉంచడం వివాదంగా మారింది. మండపంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో సంచలన వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత ఎంపీ బాపట్ల సురేష్తో వైరం, ఇసుక పంపకాల్లో గొడవలు ఆమెను మరింత వివాదాల్లోకి నెట్టాయి. తన నియోజకవర్గ పరిధిలో మరో నేత పెత్తనం సహించనంటూ ఆమె బహిరంగంగానే చెప్పేసింది. దీంతో అసలు ఆమె ఎన్నిక చట్టవిరుద్ధమంటూ ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ నెల 26న విచారణ.. వాస్తవం బయటకు వచ్చే అవకాశం..
దీంతో ఆమె ఎస్సీ నా, క్రిష్టియనా అనేది నిరూపించుకోవాలంటూ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ నెల 26వ తేదీ శ్రీదేవిని విచారణకు రావాలంటూ ఉత్వర్వులు జారీచేశారు. అయితే శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన మహిళ అయినప్పటికీ క్రైస్తవంలోకి మారారు. ఇలా చాలామంది తమకు ఇష్టమైన మతాన్ని అనుసరిస్తుంటారు. కొందరు మాత్రమే చట్టపద్ధతిని అవలంభిస్తారు. అదే వరుసలో శ్రీదేవి కూడా బీసీ సీ పరిధిలోకి వస్తారా లేక ఎస్సీ వర్గంలో ఉంటూనే క్రైస్తవం అనుసరిస్తున్నారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఆమే క్రైస్తవంలో నే కొనసాగేట్టైతే ఎమ్మెల్యే పదవి ఊడినట్టేననే చర్చ జరుగుతోంది. ఈ నెల 26వ తేదీ జరిగే విచారణలో అసలు వాస్తవం తెలిసిపోతుందనే చర్చ జరుగుతోంది.