ఏపీలో పతాక స్ధాయికి కుల పోరు... రాజ్యాంగ వ్యవస్ధలకూ మకిలి.. జగన్, బాబు ఇద్దరూ దొందూదొందే..
కులాల కుంపట్లకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కుల సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో సీఎం జగన్ చేసిన సంచలన ఆరోపణలు కులపోరుకు మరోసారి ఆజ్యం పోశాయి. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ ప్రయోజనాల కోసమే ఉద్దేశపూర్వకంగానే స్ధానిక ఎన్నికలు వాయిదా వేశారంటూ జగన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఏపీలో కులాల కుంపటి..
ఏపీలో దశాబ్దాలుగా ఏకపక్షంగా అధికారాన్ని చెలాయించిన కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు రాష్ట్ర విభజన తర్వాత మరింత చెలరేగిపోవడం ప్రారంభించాయి. అధికారమే పరమావధిగా జరుగుతున్న ఈ కుల పోరుకు వైసీపీ, టీడీపీ కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ.. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఓ బలమైన వ్యతిరేకతను నిర్మించడంలో సక్సెక్ అయింది. అదే 2019 ఎన్నికల్లో టీడీపీని దాదాపుగా తుడిచిపెట్టేసింది. వైసీపీ విపక్షంలో ఉండగా.. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కుల కోణంలోనే వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అవి డీఎస్పీల బదిలీలు అయినా, కేబినెట్ బెర్తులైనా, ప్రభుత్వంలో పదవులైనా అన్నింటిలోనూ చంద్రబాబు తన సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని గత టీడీపీ హయాంలో జగన్ ఆరోపించేవారు.
జగన్ అధికారంలోకి వచ్చాక..
2019 కంటే ముందు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను సామాజిక వర్గ కోణంలోనే వ్యతిరేకించిన జగన్. తాను అధికారం చేపట్టిన వెంటనే తనకు అండగా నిలిచిన రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేశారు. కేబినెట్ మినహాయిస్తే సలహాదారులతో సహా అన్ని పదవుల్లోనూ రెడ్ల హవానే కొనసాగుతోంది. దీంతో జగన్ కూడా సామాజిక వర్గం విషయంలో చంద్రబాబుకు ఏ విధంగానూ తీసిపోరని తేలిపోయింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రెస్ మీట్లలోనూ నేరుగానే ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇక మాట్లాడాల్సిన అవసరమే లేదు.
స్ధానిక పోరు వాయిదాతో జగన్..
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్లస్ కమ్మ కులసమీకరణాలపై నోరు మెదపకుండా కేవలం తన సామాజికవర్గానికి పదవులు ఇచ్చుకుంటూ వెళ్లిన జగన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం... స్ధానిక ఎన్నికల వాయిదా రూపంలో గట్టి షాక్ ఇచ్చింది. దీంతో జగన్ ఆగ్రహం ఆపుకోలేకపోయారు. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గాన్నే లక్ష్యంగా్ చేసుకుంటూ ఎన్నికల వాయిదాపై ఆయన నిర్ణయాన్ని ఏకిపారేశారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్ ను నియమించినా తాము కొనసాగించామని, కానీ స్దానిక ఎన్నికల వేళ ఆయన టీడీపీని ఓటమి నుంచి తప్పించేందుకే ఎన్నికలు వాయిదా వేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
Recommended Video
కులాలపై మళ్లీ మొదలైన చర్చ...
రాష్ట్ర్లంలో స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదాకు చంద్రబాబు కులానికి చెందిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి కుల చర్చ మొదలైంది. ఓవైపు తన సామాజికవర్గానికే జగన్ పదవులు ఇచ్చుకుంటున్నారని చంద్రబాబు, రాజ్యాంగ వ్యవస్ధల్లో తన కుల మనుషులను ఉంచి రాజకీయాలు చేస్తున్నారని జగన్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సాధారణ జనానికి సైతం కంపరం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో జనం వీరికి ఓటేసింది అన్ని కులమతాలకు న్యాయం చేసేందుకా లేక సామాజిక వర్గాల వారీగా విడదీసి చూసేందుకా అన్న చర్చ సాగుతోంది. రాజ్యాంగాన్ని కాపడతామని ఒట్టేసి పదవులు చేపట్టిన ప్రభుత్వాధినేతలు, ప్రతిపక్ష నేతలు ఇప్పుడు కులాల కుంపట్లను స్వయంగా రగిలించేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.