ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ లో చుక్కెదురు: టీడీపీ హాయంలో కీలకంగా: వరుస షాకులతో దిగాలు..!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు క్యాట్ లో చుక్కెదురైంది. ఆయన్ను సస్సెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఏబీ క్యాట్ ను ఆశ్రయించారు. అయితే, క్యాట్ దీని పైన విచారించిన తరువాత ఏబీ పిటీషన్ ను కొట్టివేసింది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఏబీ వేంకటేశ్వరరావు వ్యవహరించారు.
అయితే, ఆయన ఆ సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..భద్రతా పరికరాల నిర్వహణ వ్యవహారంలోనూ ఆయన పైన అభియోగాలు ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ను సమర్ధిస్తూ కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సైతం విచారణ జరిపి వెంటనే చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఏపీ హోంశాఖను ఆదేశించింది. ఇప్పుడు క్యాట్ సైతం సస్పెన్షన్ ను సమర్ధించటంతో ఏబీకి చిక్కులు మొదలయ్యాయి.
ఏబీకీ వరుస షాక్ లు..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వేంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా సుదీర్ఘ కాలం పని చేసారు. 2019 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను నిఘా చీఫ్ బాధ్యతల నుండి తప్పించింది. ఎన్నికల విధుల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆ సమయంలోనే ఆయన తరపున అప్పటి ప్రభుత్వం కోర్టును ఆశ్రయించినా ఫలితం రాలేదు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు ఏ హోదా ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
రాజకీయ వేధింపుల్లో భాగంగానే
కొద్ది కాలం క్రితం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన టీడీపీ ఫైర్ అయింది. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఏబీ పైన చర్యలకు దిగిందని వాదించింది. ఏబీ వేంకటేశ్వరరావు నిఘా చీఫ్ గా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..భద్రతకు సంబంధించిన నిఘా పరికరాల విషయంలోనూ ఆయన పైన ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది.
నాడు కేంద్రం..నేడు క్యాట్ సమర్ధన
ఇక, వైసీపీ ప్రభుత్వం ఏబీ వేంకటేశ్వరావు పైన సస్పెన్షన్ వేటు వేయటాన్ని కేంద్రం సమర్ధించింది. దీని పైన కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 7లోగా చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఏపీ హోంశాఖను కేంద్రం ఆదేశించింది. ఏబీ అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయంది. వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హోంశాఖను కేంద్రం కోరింది. ఆయనపై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారన్న ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Recommended Video
తాను మానసికంగా బలంగా ఉన్నానని
ఆ సమయంలో ఏబీ తన బంధువులకు ఒక బహిరంగ లేఖ రాసారు. ఈ నిర్ణయం ద్వారా తాను తప్పు చేసినట్లు కాదని..తాను మానసికంగా బలంగా ఉన్నానని పోరాడగలనని చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో తన సస్పెన్షన్ పైన క్యాట్ ను ఆశ్రయించారు. తనకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి వేతనం ఇవ్వటం లేదని..అక్రమంగా సస్పెండ్ చేసారని తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిని విచారించిన క్యాట్ తాజాగా ఆయన పిటీషన్ ను కొట్టివేస్తూ..వేంకటేశ్వర రావుపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను సమర్థించింది..