టీ ప్రియులూ జాగ్రత్త! రైలు టాయ్లెట్లో టీ క్యాన్లు: ఏం జరిగింది?(వీడియో)
హైదరాబాద్: భారతీయులకు టీ(ఛాయ్)తో ఉన్న అనుబంధం విడదీయరానిది. దాదాపు అన్ని సమయాలు, సందర్భాల్లోనూ టీ తాగేందుకు మొగ్గు చూపుతారు. ఇక ప్రయాణాల్లో అయితే టీ తాగకుండా ఉండలేరు కొందరు.
అయితే, ఇప్పుడు మాత్రం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ వీడియో చూసిన తర్వాత టీకి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. టీ తీసుకొచ్చే క్యాన్లలో టీ అమ్మేవారు టాయ్లెట్లలోని నీళ్లను నింపడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది.
టాయ్లెట్లలో టీ క్యాన్లు..
ఆ వీడియోను గమనించినట్లయితే.. ఓ టీ అమ్మే వ్యక్తి రైల్లోని ఓ టాయ్లెట్ డోర్ కొట్టి చాయ్ అనగానే అందులోంచి మరో వ్యక్తి మూడు చాయ్ క్యాన్లను అతని చేతికి అందించాడు. అందులో ఓ క్యాన్ని ఫ్లాట్ ఫాంపై ఉన్న మరో టీ అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. మిగితా రెండు టీ క్యాన్లను వారిద్దరూ తీసుకెళ్లారు.
టాయ్లెట్ నీళ్లు కలిపారా? లేక..
అయితే ఆ టీ క్యాన్లలో టాయ్లెట్లోని నీళ్లు కలిపారా? లేక ఖాళీ క్యాన్లను ఆ టాయ్లెట్లోని నీళ్లు నింపి వాటితో టీ తయారు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రశ్నిస్తే.. తడబడుతూ జారుకున్నారు..
లేదంటే రైలు కంపార్ట్ మెంట్లలో స్థలం లేకపోవడంతో మూడు టీ క్యాన్లు ఈ టాయ్లెట్లో పెట్టారా? అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తి.. రైలు టాయ్లెట్ నుంచి టీ క్యాన్లు తీసుకెళ్లినవారిని ప్రశ్నించగా.. వారు సమాధానం చెప్పకుండా తడబడుతూ అక్కడ్నుంచి జారుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే..
అయితే, వీడియో తీసిన వ్యక్తి.. తెలుగులోనే మాట్లాడటంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైళ్లలో టీ తాగే వారు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు నెటిజన్లు సూచించారు. మరికొందరు.. ఈ వ్యవహారంపై రైల్వే శాఖ, సంబంధిత మంత్రి పీయూష్ గోయల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.