పాదయాత్ర?: జగన్కు మినహాయింపు వద్దంటూ కోర్టులో సీబీఐ కీలక వాదనలు
హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన వాదనను వినిపించింది సీబీఐ. అంతేగాక, ముందస్తు అనుమతి కోరకుండానే పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన జగన్కు కోర్టు విచారణ ప్రక్రియపై గౌరవం లేదని అర్థమవుతోందని సీబీఐ ఆరోపించింది. కోర్టు విచారణ సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వైయస్ జగన్, విజయసాయిరెడ్డిలు కోర్టులోనే ఉన్నారు.
సీబీఐ అభ్యంతరం
సీబీఐ కోర్టులో తన వాదనను వినిపిస్తూ.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం జగన్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని పేర్కొంది. రాజకీయ కార్యక్రమాల కోసం విచారణకు గైర్హాజరు కావడం క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనపై సీబీఐ, ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి.
గౌరవం లేదు..
ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరుతూ కౌంటర్ను దాఖలు చేశాయి. అనేక కేసులు పెండింగ్లో ఉండగా.. ముందస్తు అనుమతి పొందకుండానే జగన్ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. నవంబర్ 2 నుంచి ఆరు నెలల పాటు మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని పేర్కొంటూ కరపత్రాన్ని కూడా ముద్రించారని కౌంటర్లో సీబీఐ పేర్కొంది. ముందస్తు అనుమతి లేకుండా పాదయాత్ర ప్రకటించడం జగన్కు కోర్టు విచారణ ప్రక్రియ పట్ల గౌరవం లేదని తెలుస్తోందని దర్యాప్తు సంస్థ వ్యాఖ్యానించింది.
మినహాయింపు ఇవ్వొద్దు..
భావప్రకటన స్వేచ్ఛకు సహేతుకమైన ఆంక్షలు ఉంటాయని, చట్టం ప్రకారం కోర్టుకు జగన్హాజరు కావాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఇటీవల జగన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసినందున.. తీవ్ర నేరాల్లో మినహాయింపు ఇవ్వొదని కోర్టును సీబీఐ కోరింది. అభియోగాల నమోదు ప్రక్రియ దశలో కేసులు ఉన్నందున.. నిందితులు గైర్హాజరైతే విచారణపై ప్రభావం పడుతుందని దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది.
ప్రశ్నార్థకంగా పాదయాత్ర..
జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. జగన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఈడీ సైతం ప్రస్తావించింది. తమను అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలన్న జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. మళ్లీ వచ్చే శుక్రవారం (అక్టోబర్ 20న) విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో జగన్ నిర్వహించతలపెట్టిన పాదయాత్ర ప్రశ్నార్థకంగా మారింది.