రూ.2కోట్ల లంచం: ఐ-టీ కమిషనర్, ఎస్సార్ ఎండీ అరెస్ట్, ‘రెండ్రోజుల్లో కూతురు పెళ్లి’
ఆ అధికారి ఏకంగా రెండు కోట్ల మేర లంచం తీసుకునేందుకు చేతులు చాచాడు. మొదటగా రూ.1.50కోట్లు పుచ్చుకున్నాడు. అయితే, ఈ విషయం సీబీఐ వరకూ వెళ్లడంతో ఆయన గుట్టురట్టయింది.
విశాఖపట్నం: లంచావతారులకు దడ పుట్టించే పదవీలో ఉన్నారాయన. కానీ, ఆయనే ఓ పెద్ద లంచావతారిగా మారిపోయారు. ఏకంగా రెండు కోట్ల మేర లంచం తీసుకునేందుకు చేతులు చాచాడు. మొదటగా రూ.1.50కోట్లు పుచ్చుకున్నాడు. అయితే, ఈ విషయం సీబీఐ వరకూ వెళ్లడంతో ఆయన గుట్టురట్టయింది. ఆయనే విశాఖపట్నంకు చెందిన బీబీ రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం ఆయన ముంబై ఆదాయపు పన్ను శాఖ(అప్పీల్-30డివిజన్) కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఎస్సార్ గ్రూప్ ప్రధాన ట్రస్టీగా ఉన్న బాలాజీ ట్రస్ట్కు మేలు చేసేందుకు లంచం పుచ్చుకుంటూ రాజేంద్రప్రసాద్ బుధవారం సీబీఐ అధికారులకు దొరికిపోయారు. ఇదే కేసులో ఎస్సార్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ మిట్టల్ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
రూ. 2 కోట్ల ఒప్పందం
సీబీఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన బీబీ రాజేంద్రప్రసాద్ 1992 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. బాలాజీ ట్రస్ట్కు సంబంధించి ఆదాయపు పన్ను అప్పీల్ వ్యవహారంలో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు సంస్థ ప్రతినిధులతో రూ.2కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రూ.కోటిన్నర ఇప్పటికే పుచ్చుకున్నారు. మే 6వ తేదీన తన కుమార్తె వివాహం ఉండటంతో... ఆఫీసుకు సెలవు పెట్టి విశాఖ వచ్చారు.
సొమ్ము చేరిందిలా..
లంచంలో మిగితా మొత్తాన్ని నేరుగా తనకు కాకుండా... ముంబైలో రియల్ ఎస్టేట్ ట్రేడ్ ఏజెంట్గా పనిచేస్తున్న తన పరిచయస్తుడికి ఇవ్వాలని సూచించారు. ఆ మేరకు ట్రస్ట్ ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్ సూచించిన వ్యక్తికి సొమ్ములు ఇచ్చేశారు. ఆ డబ్బును విశాఖలోని సురేశ్ కుమార్ జైన్ అనే రియల్ ఎస్టేట్ ట్రేడ్ ఏజెంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని ముంబైలోని తన పరిచయస్తుడికి రాజేంద్ర ప్రసాద్ సూచించారు.
రెడ్ హ్యాండెడ్గా..
కాగా, సురేశ్ కుమార్కు ఆ సొమ్ములు అందగానే... బుధవారం విశాలాక్షి నగర్లోని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. రూ.19.34 లక్షల లంచం సొమ్ము ఐటీ కమిషనర్కు అప్పగించారు. ఆ డబ్బులు ఇస్తుండగా.. సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టేశారు. ఇద్దరినీ అరెస్టు చేశారు.
రూ.1.50కోట్ల నగదు, పత్రాలు స్వీజ్
ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ నివాసంతోపాటు ముంబైలోని ఆయన నివాసం, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. బాలాజీ ట్రస్టు నుంచి అప్పటికే పలు విడతల్లో పుచ్చుకున్న రూ.1.50 కోట్ల నగదును, కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు, మూడు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సార్ ఎండీతోపాటు పలువురు జైలుకు
అంతేగాక, ఇదే కేసులో ముంబైలో ఎస్సార్ గ్రూప్ ఎండీ ప్రదీప్ మిట్టల్, ఎస్సార్ గ్రూప్ అకౌంట్స్ ఆఫీసర్ బిపిన్ బాజ్పేయి, జీకే చోక్సీ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ శ్రేయాస్ పరేఖ్, రియల్ ఎస్టేట్ ట్రేడ్ ఏజెంట్ మనీశ్ జైన్లను అరెస్ట్ చేశారు.
మరో రెండురోజుల్లో రాజేంద్ర ప్రసాద్ కుమార్తె పెళ్లి
మే 6న రాజేంద్రప్రసాద్ కుమార్తె పెళ్లి జరగాల్సివుంది. ఇందుకోసం బీచ్రోడ్లోని ఓ రిసార్ట్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అంతలోనే రూ. 2కోట్ల డీల్ కుదుర్చుకుని రూ.1.50కోట్లు లంచంగా తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ ను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో ఆందోళన నెలకొంది.