జగన్ అందుకు అనర్హుడు, వారానికి వచ్చేది ఒక్కరోజు: కోర్టులో సిబిఐ
హైదరాబాద్: నవంబర్ 2వ తేదీ నుంచి తాను పాదయాత్ర చేస్తున్నానని, ఇందుకోసం తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం కోర్టు తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.
పాదయాత్ర చేస్తున్నా, ప్రతి శుక్రవారం కోర్టుకు రాలేను: కోర్టులో జగన్ పిటిషన్
ఆరు నెలలు అడిగిన జగన్
శుక్రవారం (అక్టోబర్ 13) అక్రమాస్తుల కేసు నేపథ్యంలో జగన్ కోర్టుకు హాజరయ్యారు. తనకు ఆరు నెలల పాటు కోర్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన ఇటీవల దాఖలు చేసిన తన పిటిషన్లో కోరారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. దీనిపై సిబిఐ కౌంటర్ పైల్ దాఖలు చేసింది.
జగన్ అందుకు అర్హుడు కాదు
తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపును కోరేందుకు అనర్హుడని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన తన పిటిషన్లో పేర్కొంది. జగన్కు మినహాయింపు ఇవ్వవద్దని కోరింది.
ఆయన కోర్టుకు వచ్చేదే ఒక్కరోజు
అక్రమాస్తుల కేసు విచారణను జాప్యం చేసేందుకే జగన్ ఆరు నెలల పాటు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని సిబిఐ పేర్కొంది. జగన్ కోర్టుకు వచ్చేది వారానికి ఒక్క రోజు మాత్రమేనని, ఆ శుక్రవారం రోజు కూడా మినహాయింపు కోరితే ఎలా అని సిబిఐ తన కౌంటర్లో పేర్కొంది. ఆయన పిటిషన్ను అనుమతించవద్దని చెప్పింది.
హైకోర్టు సూచనల మేరకు సిబిఐ కోర్టుకు
కాగా, ఇంతకుముందు ఇదే విషయమై జగన్ హైకోర్టును ఆశ్రయించగా, సిబిఐ కోర్టులోనే పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.