YS Jagan: సీబీఐ కోర్టు సంచలనం: వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు
అమరావతి: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణ విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
ప్రతి శుక్రవారం..
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన ఈ కేసులో వైఎస్ జగన్ సుమారు ఎనిమిదేళ్ల నుంచీ విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో గడిపారు. అనంతరం బెయిల్ ను పొందారు. ప్రస్తుతం వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా.. వైఎస్ జగన్ ప్రతి శుక్రవారమూ న్యాయస్థానానికి హాజరవుతూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా కూడా ఆయన ఎక్కడ ఉన్నా ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ న్యాయస్థానానికి హాజరవుతూ వచ్చారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున..
కాగా..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సి వస్తే 60 లక్షల రూపాయలను ప్రభుత్వం తరఫున ఖర్చు చేయాల్సి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు..
ముఖ్యమంత్రికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలను ఆలకించింది న్యాయస్థానం. తొలుత- ఈ పిటీషన్ ను న్యాయస్థానం తోసి పుచ్చింది. దీనితో వైఎస్ జగన్ ప్రతి శుక్రవారమూ సీబీఐ న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని భావించారంతా. ఇదే విషయంపై దాఖలైన మరో పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.