ఆస్తుల కేసు: వైఎస్ జగన్, విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట
హైదరాబాద్: ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఆస్తుల కేసును ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే వారి లాయర్లు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కోర్టులో నమోదైన కేసుల విచారణ శుక్రవారం జరిగింది. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి, ఇతర నిందితుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిని కోర్టు అంగీకరించారు. ఈ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులను త్వరితగతిన విచారణ చేపట్టాలని సూచించింది. దీనిపై స్పందించిన హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
ఇది ఇలావుండగా, కరోనా నేపథ్యంలో కోర్టు హాలులో ఎక్కువ మంది న్యాయవాదులు, నిందితులు ఉండటం ఇబ్బందిగా ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జగన్ తరపు లాయర్లు కోరారు. తాము కూడా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జగన్ కేసులో నాలుగు ఛార్జీషీట్లకు సంబంధించి హైకోర్టులో స్టే ఉంది. స్టే ఉన్న కేసులను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.