సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్కు చుక్కెదురు: ‘ఏపీ ప్రజలపై రూ. 30కోట్ల భారం’
హైదరాబాద్/అమరావతి: అక్రమాస్తుల సీబీఐ, ఈడీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
మినహాయింపు లేదు..
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ శుక్రవారం జరిగింది. ఈరోజు విచారణకు సీఎం జగన్ మినహాయింపు కోరారు. అయితే, కోర్టు అందుకు నిరాకరించింది. ఎంపీ విజయసాయి రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, రాజగోపాల్ తదితరులు కోర్టుకు సీబీఐ హాజరయ్యారు.
జగన్ కోర్టు ఖర్చు రూ. 30 కోట్ల భారం ప్రజలపై..
మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులను ప్రస్తావిస్తూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారని ఆరోపించారు. అవినీతి, అక్రమ కేసుల్లో సీఎం జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ. 30 కోట్ల వరకు భారం పడుతుందని దేవినేని వ్యాఖ్యానించారు. అవినీతి సీఎం వల్ల రాష్ట్ర ప్రజలు ఆ భారం భరించాలా? అని ప్రశ్నించారు.
కోర్టుకు వెళ్తామంటే దేవినేని..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తన సొంత అజెండా అమలు చేస్తున్నారని.. ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదని అన్నారు. మండలి విషయంలో సీఎం జగన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే కోర్టుకెళ్తామన్నారు.
ఏపీలో అరాచక పాలన సాగుతోంది..
అక్రమ ఆస్తుల కేసులో ఏ2 ముద్దాయి విజయసాయి రెడ్డికి మండలిలో ఏం పని? అని దేవినేని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తప్పు చేస్తున్నందునే శాసన మండలి ప్రసారాల లైవ్ నిలిపివేశారని ఆరోపించారు. మండలి ఛైర్మన్పై దాడికి యత్నించారని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను హింసిస్తున్నారని మండిపడ్డారు. మీడియాపై ఆంక్షలు పెడుతున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.