జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు: ఇందూ కేసు.. జగన్-విజయసాయిలకు సీబీఐ షాక్
హైదరాబాద్: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఇందూ టెక్ జోన్ ఛార్జీషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది.
వైయస్ జగన్తో పాటు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీపీ ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డిలకు న్యాయస్థానం సమన్లు పంపించింది. మార్చి 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఇందూ టెక్ జోన్
ఈడీ కేసుల కోసం ప్రత్యేకంగా ఉన్న న్యాయస్థానం ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీటును విచారణకు స్వీకరించింది. దీంతో పైవారికి సమన్లు జారీ చేసింది. ఈడీ ఇందూ టెక్ జోన్ విషయమై గతంలో ఛార్జీషీటు దాఖలు చేసింది.
Recommended Video
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నాటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలో ఇందూ టెక్ జోన్ (ఎస్ఈజెడ్) కోసం 250 ఎకరాల భూమిని అలాట్ చేసింది. శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన ఇందు కన్సార్టియంకు ఆ భూమిని ఇచ్చిందని ఈడీ ఛార్జీషీటులో పేర్కొంది.
అర్హతలు లేనప్పటికీ సిఫార్సు
అవసరమైన అర్హత లేనప్పటికీ నాడు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీ మరియు వైస్ చైర్మన్గా ఉన్న బీపీ ఆచార్య ఈ కేటాయింపులకు సిఫార్సు చేశారని పేర్కొన్నారు.
కంపెనీలకు బదలీ
ఎస్ఐజెడ్ అప్రూవల్ వచ్చాక అందులో నుంచి 100 ఎకరాలను శ్యాంప్రసాద్ రెడ్డి తన తనయుడు దయాకర్ రెడ్డికి చెందిన ఎస్పీఆర్ ప్రాపర్టీస్కు బదలీ చేశారని, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన రెండు కంపెనీలకు షేర్లు విక్రయించారి ఈడీ పేర్కొంది.
జగన్ కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడి
శ్యాంప్రసాద్ రెడ్డి రూ.50 కోట్లను వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టారని ఈడీ ఛార్జీషీటులో పేర్కొంది. అలాగే జగన్కే చెందిన కార్మెల్ ఏసియాలో రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇదంతా క్విడ్ ప్రో కో లెక్కన జరిగిందని పేర్కొంది. మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 ప్రకారం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది.