శ్రీలక్ష్మి విచారణకు కేంద్రం అనుమతి, నోటీసులు జారీ
సిబిఐ కేసులతో శ్రీలక్ష్మి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓఎంసి, దాల్మియా చార్జిషీట్లలో ఆమెపై అభియోగాలను నాంపల్లి సిబిఐ కోర్టు ఇప్పటికే విచారిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం (పిసి యాక్ట్)కింద కూడా శ్రీలక్ష్మిపై అభియోగాలున్నాయి.
వీటిపై విచారణకు కేంద్రం నుంచి అనుమతి పత్రాలు అందడంతో సిబిఐ అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేశారు. వీటి పరిశీలన తర్వాత కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి బాలయోగి శుక్రవారం (21న) హాజరు కావాలంటూ శ్రీలక్ష్మికి సమన్లు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనురాగ్ శర్మ సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)సి)(డి)ల కింద మోపిన అభియోగాలను విచారణ కోసం పరిగణలోకి తీసుకోవాలంటూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు ఈ నెల 21న కోర్టుకు హాజరు కావాలని శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది.
ఇక రాంకీ సంస్థకు భూముల కేటాయింపు కేసులో ఆరోపణలున్న ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపైనా పిసి యాక్ట్ కింద విచారణకు ఇటీవలే అనుమతి వచ్చిన నేపథ్యంలో దీన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.