రాయపాటికి తిప్పలు తప్పవా :ట్రాన్స్టాయ్ అప్పులు రూ.8,830 కోట్లు: సీబీఐ దర్యాప్తు వేగవంతం..!
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు రుణాల ఎగవేత మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ రాయపాటి పైన కేసు నమోదు చేసింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ లావాదేవీల పైన సీబీఐ లోతుగా పరిశోధన చేస్తోంది. అందులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచినట్లు సమాచారం. 2013లో భారీగా రుణాలు పొందిన ట్రాన్స్టాయ్ తరువాతకాలంలో వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో ప్రస్తుత బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. రుణాలు తిరిగి చెల్లింపులో విఫలమవుతున్న కారణంగా బ్యాంకులు సీబీఐకు ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో..సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ అధికారుల విచారణ లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాయపాటి ఉక్కిరి బిక్కిరి..
మాజీ ఎంపీ రాయపాటి సీబీఐ కేసుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా సీబీఐ దాడుల సమయంలో తమకు ట్రాన్స్ట్రాయ్ సంస్థకు సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. కెనరా బ్యాంకు ఈ సంస్థకు రూ 990 కోట్ల రుణం ఇచ్చింది. ఆ రుణం తిరిగి చెల్లింపు విషయంలో విఫలమవ్వటంతో బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది.
అయితే, ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డైరెక్టర్, ప్రమోటర్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ మీద రుణాల ఎగవేత కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కంపెనీకి రుణాల జాబితా పెద్దమొత్తంలోనే ఉంది. సీబీఐ తాజా కేసుతో కంపెనీకి చెందిన పలు ఆర్థిక లావాదేవీలు వెలుగుచూస్తున్నాయి.
ట్రాన్స్ట్రాయ్ అప్పులు రూ.8,830 కోట్లు
సీబీఐ దాడులతో ట్రాన్స్ట్రాయ్ ఆర్దిక స్థితి గతుల పైన మరింత లోతుగా పరిశీలన మొదలైంది. అందులో 2013 ప్రారంభంలో ట్రాన్స్ట్రాయ్ తాను దక్కించుకున్న రూ.4,717 కోట్ల విలువైన పోలవరం హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పనులతోపాటు, ఇతర అభివృద్ధి పనులు చూపి 14 బ్యాంకుల కన్సార్షియం వద్ద వివిధ దశల్లో రూ.8,800 వరకు రుణాలు పొందింది.
ఈ 14 జాతీయ బ్యాంకుల్లో రూ.990 కోట్లు వరకు అప్పిచ్చిన కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా ఉంది. తమ నుంచి నిధులను రుణాలుగా పొందినా తిరిగి చెల్లించడంలో ట్రాన్స్టాయ్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ 2015 నుంచే బ్యాంకుల కన్సార్షియం రుణాల రికవరీకి ప్రయత్నాలు ప్రారంభించాయి. అదే మే నెలలో ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించాయి. ఇక 2018 లోనే నేషనల్ కంపనీస్ లా ట్రిబ్యునల్ లో కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. తాజా గా తమ నుంచి తీసుకున్న రుణాల్లో రూ.264 కోట్లను వేరే ఖాతాలకు మళ్లించారన్న యూనియన్బ్యాంకు ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ప్రాజెక్టుల నిర్వహణలో సమస్యలు..
ట్రాన్స్ట్రాయ్ సంస్థ 14 జాతీయ బ్యాంకుల వద్ద తాము పలు ఇరిగేషన్, రోడ్లు, మెట్రో, మెట్రో అండ్ రైల్వేస్, ఆయిల్ గ్యాస్ల ప్రాజెక్టులు చేపడతామని ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ చెబుతోంది. వాస్తవానికి ఇంతవరకూ ఈ కంపెనీ కేవలం రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులను విజయవంతంగానే పూర్తి చేసింది. మిగిలిన రంగాల్లో ఇంతవరకూ ఎలాంటి పనులు చేపట్టలేకపోయింది.
ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో కుమరంభీమ్ ప్రాజెక్టు, అనంతపురంలోని చాగల్లు బ్యారేజ్లను పూర్తి చేసింది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్ ఫేస్-1 పనులను, మధ్యప్రదేశ్లో రెండు భారీ, తమిళనాడులో ఓ భారీ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసి..మరింత లోతుగా విచారణ జరిగితే..ఆ సంస్థ పై ఎటువంటి చర్యలకు దిగుతారనేది ఇప్పుడు చర్చకు కారణమైంది.