రాజధాని భూములపై సీబీఐ విచారణ: లోక్సభలో వైసీపీ ఎంపీ, కేంద్రమంత్రికి విజయసాయి కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులు, అమ్మకాలు, కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో పెట్టుబడులు తరలిపోతున్నాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రూ. 25వేల కోట్ల సోలార్ పార్కు ఏర్పాటుకు సింగపూర్, అబుదాబి ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోబోతున్నామని ఎంపీ మిథున్ తెలిపారు.
టీడీపీ నేతల చేతుల్లోనే..
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని భూముల కేటాయింపు అంశాన్ని ప్రస్తావించారు. మొదట రాజధానిని తిరువూరు వద్ద పెడతామని చెప్పి.. భూములు కొన్న తర్వాత తిరువూరు కాదు.. అమరావతిని ప్రకటించడం సీఎంగా తన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించడమేనని, ఇది పెద్ద కుంభకోణమని మిథున్ రెడ్డి ఆరోపించారు. 4వేలకు పైగా ఎకరాలు టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
సీబీఐ విచారణ జరపాలి..
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 780 మంది రూ. కోట్లలో పెట్టి భూములు కొన్నారని, ఆదాయపుపన్ను పరిధిలోని లేని వ్యక్తులు ఎలా కొనగలరని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఈ కుంభకోణం బయటకు రావాలని అన్నారు.
కేంద్రమంత్రికి విజయసాయి కృతజ్ఞతలు..
మరోవైపు కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని తెలిపారు. తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
విజయసాయిరెడ్డి వినతిపై స్పందించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఉల్లి ఎగుమతికి అనుమతిస్తామని కేంద్రవాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. దీనిపై రెండ్రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతు సమస్యలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు విజయసాయి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ సభ్యుల నినాదాలపై విజయసాయి ఆగ్రహం
జీరో అవర్లో రైతు సమస్యలపై ప్రస్తావిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలు చేస్తూ నినాదాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక చర్యల వల్లే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.