సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?...ఇదేం వ్యూహం!
గుంటూరు:హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు...రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదంటున్నారు...కానీ వ్యవసాయ శాఖ మంత్రిని అయితే రైతుల కోసం ఏం చేయవచ్చో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నానన్నారు...ఒకవేళ వ్యవసాయ మంత్రిని కాకుంటే సామాజికవేత్తగా మారి ఏం చెయ్యాలో చూస్తానన్నారు... సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలివి.
అయితే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణకు అసలు ఏం చెయ్యాలో స్పష్టత లేదా?...లేక ఇలా రకరకాలుగా మాట్లాడటం ఏమైనా వ్యూహమా?...ఒకదానికొకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్దంగా మాట్లాడటం చూస్తుంటే ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారా?...లేక వ్యూహాత్మకంగా జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలని భావిస్తున్నారా?...అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
రిజైన్ చేయగానే...మొదటి మాటలు
ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ధరఖాస్తు చేసిన అనంతరం లక్ష్మీనారాయణ మీడియా మిత్రులతో చిట్ చేస్తూ విఆర్ఎస్ కోసం మహారాష్ట్ర డీజీపీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీలకు లెటర్ అందించాను. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి...అందుకే స్వచ్ఛంద విరమణ ఇచ్చాను. రాజకీయాలతో పాటు ఇతర వ్యవహారాలపై దృష్టిపెడతాను. శుక్రవారం రోజున మహారాష్ట్ర సీఎం, గవర్నర్లను కలుస్తాను. శుక్రవారం నుంచి విధులకు హాజరుకాను. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలను మాట్లాడుతాను అని చెప్పినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. దీన్ని బట్టి రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన ఇలా అర్థాంతరంగా ఉద్యోగాన్ని వదిలి వచ్చేస్తున్నారని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి.
అయితే...ఆ తరువాత...
ఆయన మాటలను బట్టి రాజకీయాల్లోకి రావడం ఖాయమని అర్థం అవడంతో ఏ పార్టీలోకి అనే ఊహాగానాలు సహజంగానే ఊపందుకున్నాయి. అదే విషయాన్ని ఆయనను వివిధ సందర్భాల్లో మీడియా ప్రశ్నించగా లక్ష్మీనారాయణ ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా స్పందించడం గమనార్హం. జనసేన పార్టీ లోకి వస్తున్నాననేవి కేవలం ఊహాగానాలేనన్నారు. తాను అలా ఎప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించారు. మీడియానే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం చేసిందన్నారు. అంటే తాను అసలు రాజకీయాల్లోకి రావాలనే విషయాన్నే ఇంకా నిర్ణయించుకోనట్లుగా మాట్లాడారు. తన విఆర్ఎస్ ధరఖాస్తు ఒకే అయ్యాక ఏ విషయం చెబుతానన్నారు.
Recommended Video
పదవీ విరమణ ఒకే...తాజా వ్యాఖ్యలు...
తాజాగా ఆయన గుంటూరు జిల్లాలోని యాజిలిలో రైతులతో సమావేశమైన సందర్భంగా మాట్లాడుతూ యాగాన్ని ఇక్కడినుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, యాజిలి పుణ్యభూమి అని కొనియాడారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయితే మీకోసం నేను ఏం చేయొచ్చో ఆలోచిస్తానని అన్నారు. ఒకవేళ తాను వ్యవసాయ శాఖ మంత్రి కాలేకపోతే ఒక సోషల్ వర్కర్ గా రైతుల కోసం ఏం చేయగలనో అని ఆలోచిస్తానన్నారు. అసలు తాను రైతులకు సేవ చేస్తాను వారికి పనికొచ్చే ఉద్యోగమివ్వమంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, అందుకే తన ఉద్యోగాన్ని వదులుకున్నానన్నారు.
లక్ష్మీనారాయణ...ఇలా మాట్లాడుతున్నారేంటి?
సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రైతులతో సమావేశం సందర్భంగా మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పష్టం చేసినట్లే అందరూ భావిస్తున్నారు. మన దేశంలో రాజకీయాల్లోకి రాకుండా కోరుకున్న పదవి చేపట్టే అవకాశం అసాధారణం గనుక ఆయన నోటివెంబడి వ్యవసాయ మంత్రి అనే మాట వచ్చింది కాబట్టి...పైగా విఆర్ ఎస్ కూడా ఒకే అయింది కాబట్టి ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పేస్తారని భావించారు. అయితే ఆ తరువాత ఆయన తన మాటలు కొనసాగిస్తూ రాజకీయాలపై నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఇంకా ఏమన్నారంటే...ప్రత్యేక హోదా
రాజకీయాల్లోకి వచ్చి రైతులకు సేవ చేయాలా? లేక రాజకీయాలకు దూరంగానే ఉండి వ్యక్తిగతంగా సర్వీస్ చేయాలా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మీడియానే తనను వివిధ పార్టీల్లో చేర్చిందని, తాను మాత్రం అన్ని పార్టీలను ఆప్షన్గా ఉంచుకున్నానని లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే తాను ఏ పార్టీతో టచ్లో లేనని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుంటానని, అధ్యయనం పూర్తయ్యాక ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
అధ్యయనం...ప్రత్యేక హోదా
ఈ సిబిఐ మాజీ జెడి చేసిన వ్యాఖ్యల్లో రెండు ప్రధానాంశాలు...ఒకటి అధ్యయనం చేసి రాజకీయాల్లోకి రావడం...రెండు ప్రత్యేక హోదా కోసం పోరాడటం..అయితే ఎపికి ప్రత్యేక హోదా కోసం పోరాడటం అంటే బిజెపికి వ్యతిరేకంగా పోరాడటమే! అంటే తాను బిజెపికి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు పరోక్షంగా సంకేతాలివ్వడమే. అయితే ఎపి బిజెపి అధ్యక్షుడిగా ఒకానొక దశలో ఈ సిబిఐ మాజీ జెడి పేరు కూడా వినిపించిన తరుణంలో ఆయన తాను బిజెపికి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు సంకేతాలు ఇవ్వడం అంటే అదో ఇండికేషనో లేక వ్యూహమో కొద్ది రోజులు వేచి చూస్తే కాని తెలియదు.
మొత్తంగా చూస్తే...ఎందుకీ కన్ఫూజన్
ఈ సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ మాటలు చూస్తే అస్పష్టంగా మీడియాను కవ్విస్తున్నట్లో, ఊరిస్తున్నట్లో ఉండటం గమనార్హం. అయితే ఎందుకిలా అనేదే ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. వ్యక్తిత్వ వికాసం గురించి కూడా యువతకు బోధించిన, బోధిస్తున్న ఈ మాజీ ఐఎఎస్ అధికారి తన రాజకీయ ఆరంగ్రేటం గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలా చేయాల్సిన అవసరమేంటీ...దాని వల్ల ఆయన హుందాతనం క్రమంగా కోల్పోతుందన్న విషయం ఆయన గ్రహించలేకపోతున్నారా? సినీ హీరో తరహాలోనే టీజింగ్ టైప్ కామెంట్లు తన నేపథ్యం దృష్ట్యా తగుతాయా?..ప్రభుత్వాన్ని గ్రామాల్లో పనిచేసే ఉద్యోగం అడిగానని, అదివ్వలేదని రాజీనామా చేశాననడం...ఇప్పుడు వ్యవసాయమంత్రి నైతే అనడం వీటిని బట్టి ఆయన కావాలనే ఇలా మాట్లాడుతున్నారని అర్ధం చేసుకోవాల్సిందే.దానివెనుక వ్యూహం ఏంటనేది త్వరగా బైటపెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిసింది.