వైఎస్ జయంతి వేళ కొత్త చర్చ.. హెలికాప్టర్ ప్రమాదంపై జేడీ లక్ష్మినారాయణ చెప్పిందేంటి?
అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. అది యాక్సిడెంటల్గా జరిగిందా. లేదంటే ఎవరిదైనా హస్తముందా?.. అనే ప్రశ్నలు సామాన్యుల నుంచి మేధావుల దాకా వారి బుర్రలకు పజిల్ పెట్టాయి.
అయితే వైఎస్ఆర్ మృతిపై దర్యాప్తు సంస్థలు మాత్రం ఒకే మాటకు కట్టుబడి ఉన్నాయి. డీజీసీఏ, సీబీఐతో పాటు మరో రెండు దర్యాప్తు సంస్థలు ఒకే విషయం వెల్లడించాయి. ఆ క్రమంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా ఆ హెలికాప్టర్ ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేసిన జేడీ లక్ష్మినారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ జయంతి వేళ ఆయన చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!
వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై జేడీ సంచలన విషయాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కలకలం రేపింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి చిత్తూరు జిల్లాకు వెళుతూ.. నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట దగ్గర జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అయితే అది యాక్సిడెంటల్గా జరిగిందా లేదంటే ప్లాన్డ్గా ఎవరైనా చేశారా అనే కోణంలో చాలామందికి చాలారకాలుగా అనుమానాలుండేవి.
అయితే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని దర్యాప్తు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. హెలికాప్టర్ క్రాష్ అంటే ఆషామాషీ కాదని.. అందులో ఓ ముఖ్యమంత్రి చనిపోవడమనేది సీరియస్ విషయంగా తీసుకున్నామని తెలిపారు. ఆ క్రమంలో దర్యాప్తులో భాగంగా సివిల్ ఏవియేషన్ నిపుణుల సాయం తీసుకున్నట్లు చెప్పారు.
Recommended Video
యాక్సిడెంటలా.. ఎవరైనా చేయించారా?
ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా చనిపోవడమనేది సాధారణంగా అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు. అందరిలాగే తమకు కూడా కేసు దర్యాప్తులో ఎన్నో అనుమానాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆ ప్రమాదం యాక్సిడెంటల్గా జరిగిందా.. లేదంటే ఎవరైనా చేయించారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశామని తెలిపారు. సీబీఐ డైరెక్టర్ కూడా కొన్ని సూచనలు చేశారని.. అవి పరిగణనలోకి తీసుకుని కేసు దర్యాప్తును పూర్తిచేశామన్నారు. ఆయన చెప్పినట్లుగా ఆడియో విజువల్స్తో కూడిన ఓ రిపోర్ట్ రూపొందించి రిలీజ్ చేశామన్నారు. అది పూర్తిగా యాక్సిడెంటల్గా జరిగిందనే విషయం అందులో ప్రెజెంట్ చేశామని తెలిపారు.
వాతావరణం సరిగా లేక.. ఆ మేఘాలే కారణం..!
ఆ రోజు వాతావరణం సరిగా లేదనే విషయం గుర్తు చేశారు జేడీ. క్యుములో నింబస్ మేఘాలే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమని వివరించారు. ఆ మేఘాల్లో వాక్యూమ్ నిండి ఉంటుందని.. అవి హెలికాప్టర్ను లాగేస్తుంటాయని వెల్లడించారు. ఆ క్రమంలో మేఘాల్లోకి హెలికాప్టర్ ప్రవేశించిందని తెలిపారు. దాంతో హెలికాప్టర్ యాక్సిడెంటల్గా కూలిపోయిందని చెప్పారు.
ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని చెప్పారు. బ్లాక్ బాక్స్లో రికార్డయిన సంభాషణలు కూడా విన్నామని.. అటు వాతావరణ శాఖ, సివిల్ ఏవియేషన్ నిపుణుల సాయంతో రిపోర్ట్ రూపొందించామని చెప్పుకొచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా యాక్సిడెంటల్గా జరిగిన ప్రమాదమని తేల్చిందని గుర్తు చేశారు.
గో అరౌండ్ అని కో పైలట్ అరిచినా..!
వైఎస్ హెలికాప్టర్ ప్రమాద సమయంలో కో పైలెట్ కెప్టెన్ ఎంఎస్ రెడ్డి 'గో అరౌండ్' అంటూ బిగ్గరగా అరిచినట్లు బ్లాక్ బాక్స్లో రికార్డయిందని గుర్తు చేశారు జేడీ. గో అరౌండ్ అనేది ఎమర్జెన్సీ సమయంలో వాడే ఒక బటన్ అని.. అది నొక్కితే సడెన్గా హెలికాప్టర్ పైకి లేస్తుందని వివరించారు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా హెలికాప్టర్లో వాడే ఫ్యూయల్, లూబ్రికెంట్స్ వాడకం ఒక్కసారిగా పెరిగి రెడ్ లైట్ వస్తుందని తెలిపారు.
ఆ సమయంలో ఆయన గో అరౌండ్ అని అరిచారని.. ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కితే హెలికాప్టర్ పైకి లేస్తుందని అలా చెప్పి ఉంటారని అన్నారు. ఒక్కోసారి హెలికాప్టర్లు ల్యాండయ్యే సమయంలో గేదెలు తదితర జంతువులు అడ్డొస్తే గో అరౌండ్ బటన్ నొక్కుతారని.. దాంతో హెలికాప్టర్ సడెన్గా దానంతట అదే పైకి వెళుతుందని చెప్పుకొచ్చారు.
ఛలో యానాం.. ఆట, మందు రెండూ.. క్యూ కడుతున్న పేకాటరాయుళ్లు
హెలికాప్టర్ ప్రయాణం అంతా సులువు కాదు.. డేంజరే..!
వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నప్పటికీ.. జరిగింది మాత్రం అదే అన్నారు జేడీ. డీజీసీఏ, సీబీఐతో పాటు మరో రెండు దర్యాప్తు సంస్థలు ఆ ప్రమాద ఘటనపై అదే విషయం వెల్లడించాయని గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రయాణం చాలా సున్నితమైందని.. వాతావరణంలో తేడా వస్తే అలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయనే విషయం చాలాసార్లు రుజువైందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జిందాల్, బాలయోగి లాంటి ఎందరో ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించడానికి వాతావరణమే కారణమని చెప్పుకొచ్చారు.