రాయపాటిపై సీబీఐ కేసు నమోదు.. ఏ సెక్షన్ల క్రింద అంటే
టీడీపీ మాజీ ఎంపీ..సీనియర్ పొలిటీషియన్ రాయపాటి సాంబశివరావు ఇళ్ళు, కార్యాలయాలపైన సీబీఐ అధికారులు దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు . హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు రాయపాటిపై కేసు నమోదు చేశారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థలోనూ సీబీఐ సోదాలుచేసిన సీబీఐ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారం పేరుతో బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకు న్న రాయపాటి వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవటంతో గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. రుణాల ఎగవేతపై యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ భార్గవ్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ట్రాన్స్టాయ్ కార్యాలయాలతో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించారు .ఇప్పుడు ఆయనకు చెందిన అన్ని కార్యాలయాల్లోనూ సీబీఐ సోదాలు చేసిన సీబీఐ రాయపాటి సాంబశివరావుపై 120(బీ), రెడ్ విత్ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్ 13(2), రెడ్ విత్ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటి మాత్రమే కాదు ఆయనతో పాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస్లను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన రాయపాటి అప్పటి నుండి సైలెంట్ గా ఉంటున్నారు. 2019 ఎన్నికల తరువాత రాయపాటి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఆయన ఇంటికి స్వయంగా బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ రావటంతో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది . కానీ రాయపాటి బీజేపీలో మాత్రం అధికారికంగా చేరలేదు. ఇప్పుడు బ్యాంకులకు రుణాల ఎగవేతతో సీబీఐ దాడులు జరగటంతో పాటు ఆయన మీద కేసు నమోదు కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.