చంద్రబాబును కలిసి ఇస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలపై..
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా ముక్కామలలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసమే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. తాను పరిశీలించిన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తానని చెప్పారు.
రాజకీయాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే అప్పుడే తాను రాజకీయాల గురించి ఆలోచిస్తానని చెప్పారు. అప్పటి వరకు రాజకీయ ఆలోచన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, వ్యవసాయరంగాలపై ఇష్టంతో తాను ఉద్యోగం వదిలేశానని చెప్పారు. రైతుల పిల్లలు వ్యవసాయంలోకి రావాలంటే వ్యవసాయ విద్యలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.
రెండు రోజుల క్రితం యువతతో మాట్లాడుతూ ఆయన టీవీ షో ప్రస్తావన తెచ్చారు. దేశానికి ఉపయోగపడే విధంగా యువత తయారుకావాలంటే కొన్ని పద్ధతులను పాటించాలన్నారు. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలని, మెదడును మన కంట్రోల్లో ఉంచుకోవాలన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు మన శ్వాసను మన కంట్రోల్లో ఉంచుకుంటే మన మెదడు మన ఆదీనంలోనే ఉంటుందన్నారు.
ప్రాణాయామం ద్వారా దానిని సాధించవచ్చునని చెప్పారు. బిగ్బాస్ షో చూడటం కోసం యువత ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని వృథా చేసుకుంటోందన్నారు. ఈ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుందని, అందరి మెదడులను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటాడని, బిగ్ బాస్ను మాత్రం ఎవరూ కంట్రోల్ చేయరన్నారు. మన మెదళ్లను మన ఆదీనంలోనే ఉంచుకోవడానికి ప్రాణాయామం తప్పనిసరి అన్నారు.