తప్పదు అంటే రాజకీయాల్లోకి: ప్రత్యేక హోదాపై లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
కడప: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలలోకి రావాల్సి వస్తే తాను కచ్చితంగా వస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సోమవారం కడపలో అన్నారు. మద్యం, కులం, డబ్బు రాజకీయాలు పారద్రోలేలా ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్ర ప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలు కోసం తాము పోరాడుతామని చెప్పారు. వ్యవసాయం, చేనేత కార్మికుల కోసం మేనిఫెస్టో రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఆయన అన్నారు.
తప్పదు అనిపిస్తే రాజకీయాల్లోకి
ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయాలే మార్గం అనిపిస్తే మాత్రం తాను రాజకీయ ప్రవేశంపై ఆలోచిస్తానని లక్ష్మీనారాయణ తేల్చి చెప్పడం గమనార్హం. తాను రాష్ట్రం అంతా పర్యటించి ప్రజలు, రైతులు, చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. తన దృష్టికి వచ్చిన వాటిలో కొన్ని మీడియా ద్వారా తెలుసుకుని అధికారులు పరిష్కరిస్తున్నారని వెల్లడించారు.
అప్పుడే బాధ్యతాయుత రాజకీయాలు
ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ప్రజా ప్రణాళిక రూపొందించే ఆలోచనలో ఉన్నామని లక్ష్మీనారాయణ చెప్పారు. అప్పుడే బాధ్యతాయుతమైన రాజకీయాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం సిఫార్సులతోనే పథకాలు కొందరికి అందుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తాము ప్రజా చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
సీఎం దృష్టికి సమస్యలు, హోదా అవసరం.. వస్తుంది
పర్యటనలో గుర్తించిన సమస్యలు, ప్రజల సూచనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని లక్ష్మీనారాయణ చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు చూసే ప్రయత్నాలు చేస్తామని అన్నారు. విభజన నేపథ్యంలో ఏపీకి చాలా నష్టం వాటిల్లిందన్నారు. దానిని పూరించేందుకు ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు. అది వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
యువతపై లక్ష్మీనారాయణ
2025 నాటికి దేశ జనాభాలో సుమారు 75 శాతం యువత ఉండే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ చెప్పారు. అందుకే వారికి సామాజిక అంశాలు, సమాజంపై అవగాహన కల్పించేందుకు, సేవాగుణాన్ని పెంచేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నానని తెలిపారు. యువతరానికి వ్యవసాయం మేలైనదిగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.