సీబీఐ ఝలక్ : ఏపీ ప్రభుత్వ అనుమతి లేకున్నా సోదాలు ? తెరమీదకు కొత్త వాదన!
ఏపీలో అధికారికి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఏపిలో పోలీసులు..సాధారణ పరిపాలన అనుమతి తీసుకోకుండా దాడులు చేయటానికి వీల్లేదని ప్రభుత్వం గతంలోనే జీవో ఇచ్చింది. అయితే, తాజాగా సీబీఐ వైసిపి ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు నివాసాలపైనా దాడులు చేసారు. ఇక, తెనాలిలో ఐటీ అధికారి ఆస్తుల పైనా సీబీఐ దాడి చేసింది. దీని పైనే ఇప్పుడు ఏపి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఏపిలో సీబీఐకి నో ఎంట్రీ..
కేంద్రంతో విభేదించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించింది. దీంతో..ఏపిలో సీబీఐకి జనరల్ కన్సెంట్ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసులు..సాధారణ పరిపాలన శాఖ అనుమతి తీసుకోకుండా సీబీఐ దాడి చేయటానికి అనుమతి లేదని స్పష్టం చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం కోరటం..లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే సీబీఐ ఏపిలో దాడులు..సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీని పైన రాజకీయంగా అనేక విమర్శలు వచ్చినా ఏపి ప్రభుత్వం మాత్రం తమ వాదనకే కట్టుబడి ఉంది.
ధిక్కరిస్తూ సీబీఐ దాడులు
ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు ఇలా ఉండగానే..సీబీఐ అధికారులు ఏపిలో ఒక రాజకీయ నేత నివాసం పైన సోదాలు.. మరో ఉద్యోగి పైనా ట్రాప్ చేసారు. ఇప్పుడు ఇదే విషయంలో ఏపి అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నర్సాపురం ఎంపీగా వైసిపి నుండి పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు నివాసాల పైన హైదరాబాద్తో పాటుగా నర్సాపురంలోనూ సీబీఐ అధికారులు సోదాలు చేసారు. అయితే, రఘురామకృష్ణంరాజు మాత్రం తాను బకాయి ఉన్న 600 కోట్ల రుణం విషయం పైన బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వచ్చారని వివరణ ఇచ్చారు. అదే విధంగా తెనాలిలో ఓ ఐటి అధికారి అవినీతికి పాల్పుడుతున్నారనే ఫిర్యాదుతో ఆయన్న సీబీఐ అధికారులు ట్రాప్ చేసారు. ఈ రెండు ఘటనల పైనా ఇప్పుడు అధికారులు సీబీఐ తమ ఉత్తర్వులను అధిగమించిందా అనే కోణంలో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
సీబీఐ వాదన ఇలా...
ఏపి ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధకారులు ఎలా దాడులు చేస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీని పైన సీబీఐ అధికారులు సైతం వివరణ ఇస్తున్నారు. తాము నర్సాపురంలోని రఘురామకృష్ణంరాజు సంస్థలపైన దాడులు చేసారనే దాని పైన సీబీఐ అధికారులు చెబుతున్న మరో వాదన తెర మీదకు వచ్చింది. తాము బెంగుళూరులో నమోదైన కేసుల మేరకు విచారణ చేస్తున్నామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ట్రాప్ కేసల్లో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దాడి తర్వాత అనుమతి కోరవచ్చని..ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే కేసును ఏసీబీకి అప్పగిస్తామని అంటున్నారు. అయతే, ఏపిలో పని చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి వ్యవహారాలను తమ ఏసీబీ చూసుకుంటుందని గతంలోనే ఏపి ప్రభుత్వ స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు తాజా పరిణామాలతో మరో సారి ఈ వ్యవహారం తెర మీదకు వచ్చింది.