లంచం: దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు
విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా కొద్ది మాసాల క్రితమే సప్తగిరి పేరుతో నిరంతర కార్యక్రమాలు కొనసాగిస్తున్న దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎన్వి హనుమంతరావును గురువారం రాత్రి సిబిఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక సీరియల్కు సంబంధించి నిర్మాతకు జరగాల్సిన చెల్లింపుల వ్యవహారంలో లక్షా 50 వేల వరకు డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన సిబిఐ బృందం రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
గురువారం సాయంత్రం 6.30 సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన న్యూస్ డైరెక్టర్ కోస్తా జిల్లాలోని పలువురు విలేఖర్లతో సమావేశమై చర్చిస్తున్న సమయంలో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది.
సిబిఐ అధికారులు గేటుకు లోపల తాళాలు వేసి సిబ్బంది మొత్తాన్ని వెలుపలికి పంపించారు. రాత్రి 10 గంటల వరకు ఒక రహస్య స్థావరంలో విచారణ జరిపినట్లు తెలిసింది. ఈ విషయమై దూరదర్శన్ అధికారులెవ్వరూ నోరు మెదపటం లేదు.