బొగ్గు కేటాయింపులు: దాసరిని ప్రశ్నించిన సిబిఐ
న్యూఢిల్లీ/హైదరాబాద్: బొగ్గు క్షేత్రాల కేటాయిపు కేసులో మాజీ కేంద్ర సహాయ మంత్రి దాసరి నారాయణ రావును సోమవారం సిబిఐ ప్రశ్నించింది. హిందాల్కో కేటాయింపులపై దాసరిని సిబిఐ ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణంలో అప్పటి బొగ్గు శాఖ మంత్రుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిబిఐ దాసరి నారాయణ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించిన రెండు కేసులను సిబిఐ మూసివేసింది. సరైన ఆధారాలు లేనందున జెఎల్డి యావత్మల్, జెఎఏస్ ఇన్ ఫ్రాక్చర్ పై పెట్టిన రెండు కేసులు మూసివేస్తున్నట్లు సిబిఐ ప్రకటించింది.
కాగా, బొగ్గుశాఖలో సంస్కరణల అమలుకు ఆ శాఖ మాజీ మంత్రులు దాసరి నారాయణ రావు, శిబుసోరెన్తో పాటు పలువురు ఎంపీలు అడ్డుపడ్డారని బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తను అమలు చేయాలనుకున్న సంస్కరణలు అమలై ఉంటే కోల్ గేట్ స్కాం జరిగి ఉండేది కాదని కూడా పరేఖ్ అభిప్రాయపడ్డారు. బొగ్గు కుంభకోణానికి దాసరి నారాయణరావు, శిబూ సోరెన్ లతోపాటు బొగ్గుశాఖ మంత్రులే ప్రధాన కారకులని ఆయన పేర్కొన్నారు.
బొగ్గు బ్లాకులను బహిరంగ వేలంలో కేటాయించాలన్న తన ప్రతిపాదనను ఈ ఇరువురు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారని, దురదృష్టవశాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం వీరిని అదుపు చేయలేకపోయారని ఆయన తెలిపారు. చివరికి లంచాలు మెక్కి పిఎస్యు సిఈఓలు, డైరెక్టర్లను నియమించే వారని పేర్కొన్నారు. అనేక మంది ఎంపీలు బ్లాక్ మెయిలర్లుగా, దోపిడీదారులుగా మారటం తన కళ్లారా చూసానని, వీరు అధికారులను, ప్రభుత్వ కంపెనీల సిఈఓలను బ్లాక్ మెయిల్ చేసేవారని ఆయన చెప్పారు.
బొగ్గుబ్లాకులను ఇంటర్నెట్ ఆధారిత వేలంలో పెట్టాలన్న ప్రధాని నిర్ణయాన్ని మంత్రులే తోసి రాజన్నారని పరాఖ్ తెలిపారు. బొగ్గు బ్లాకులకు బహిరంగ వేలంతో సహా ఇతర సంస్కరణల అమలుకు ప్రధాని తన అధికారాలను ఉపయోగించి చొరవ చూపి ఉంటే అసలు కోల్గేట్ కుంభకోణమే జరిగి ఉండేది కాదని పరాఖ్ ఖ్యానించారు. క్రూసేడర్ ఆర్ కాన్సిపిరేటర్? కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్'' పేరుతో రచించిన పుస్తకావిష్కరణ సందర్భంగా పరేఖ్ ఈ వివరాలను వెల్లడించారు.