జగన్ను వెంటాడారు.. భారతీకి సమన్లు: సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి గాంధీ
నేటీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన నాడు ఈడీ కేసులు నమోదు చేసిన మాజీ అధికారి గాంధీ ఇప్పుడు సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ సుదీర్ఘ కాలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో పని చేసారు. ఆ సమయంలో జగన్ పైన అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించారు. 2017 ఫిబ్రవరిలో వైసీపీ అధినేత జగన్ ప్రధానిని కలిసిన సమయంలో ఈడీ అధికారులు గాంధీ..గౌడ్ ఇద్దరూ ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితులని..ఆయన సూచనల మేరకు పని చేస్తున్నారని ఫిర్యాదు చేసారు. ప్రధాని దీని పైన విచారణకు ఆదేశించారు. తాజాగా సీబీఐ దాడుల్లో గాంధీ చిక్కారు.
జగన్ కేసుల్లో అత్యుత్సాహంతో..
ఈడీ అధికారిగా హైదరాబాద్లో సుదీర్ఘ కాలం పని చేసారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పైన ఆ సమయంలో అక్రమాస్తుల కేసులో జగన్ పైన ఈడీ అధికారిగా అనేక కేసులు నమోదు చేసారు. ఆస్తుల అటాచ్మెంట్కు కారణం అయనే అని వైసీపీ నేతలు చెబుతారు. జాయింట్ డైరెక్టర్ హోదాలో విదులు నిర్వహించారు. గాంధీతో పాటుగా మరో అధికారి ఉమా శంకర్ గౌడ్ ఇద్దరూ కూడా టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితులు. వీరిద్దరూ జగన్ కేసుల్లో ఇడి అటాచ్మెంట్లు ఇవ్వటంలో కీలకంగా వ్యవహరించారు. జగన్కు చెందిన సాక్షి మీడియా గ్రూపులతో పాటుగా అనేక ఆస్తులకు ఆయనే ఎటాచ్మెంట్ ఇచ్చారని చెబుతారు. గాంధీ ప్రధానంగా జగన్ కేసుల్లో జరిగే పరిణామాలను.. ప్రభుత్వ నిర్ణయాలను చంద్రబాబుకు అందిచేవారనే అభియోగం సైతం ఉంది. వీరిద్దరి సహకారంతో టీడీపీ నేతలు.. చంద్రబాబు సహకారంతో ఈ ఇద్దరు అధికారులు జగన్ ను ఆ సమయంలో వెంటాడారని వైసీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు. దీని కారణంగా ఆ ఇద్దరు అధికారుల మీద జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భారతీకి సమన్లు జారీ చేసారు..
దీంతోజగన్ అక్రమాస్తుల కేసుల్లో ఛార్జ్షీట్లు..జగన్ 16 నెలల జైలు జీవితం ముగిసిన ఆరేడు సంవత్సరాలకు ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగా భారతి పేరును చేర్చారు. ఈ మేరకు జగన్ సతీమణి భారతీకి సమన్లు ఇచ్చారు. దీంతో..జగన్ ఈ విషయం పైన ప్రధానికి లేఖ రాసారు. అయినా స్పందన రాలేదు. దీంతో..2017లో విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో వీరిద్దరి వ్యవహారం పైన నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేసారు. దీంతో..ప్రధాని విచారణకు ఆదేశించారు. సౌత్ రీజియన్ ముఖ్య కేంద్రం ఉన్న చెన్నైలోని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు విచారించి..ఈ ఇద్దరి మీద అభియోగాలను నిర్ధారించారు.దీంతో వారిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుండి తప్పించి జీఎస్టీ విభాగానికి బదిలీ చేసారు. వారిద్దరూ ఇప్పుడు హైదరాబాద్ లో జీఎస్టీ నిఘా విభాగంలో పని చేస్తున్నారు.
సీబీఐ ఉచ్చులో చిక్కిన గాంధీ..
మాజీ ఈడీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీకి చెందిన ఆస్తుల పైన హైదరాబాద్..విజయవాడల్లో సీబీఐ అధికారులు దాడులు చేసారు. ఆ దాడుల్లో దాదాపు 3.75 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన పైన శాఖా పర మైన చర్యలకు రంగం సిద్దం అయింది. అయితే, నాడు గాంధీ తీసుకున్న నిర్ణయాల కారణంగా జగన్ ఇబ్బంది పడగా.. జగన్ నేరుగా ప్రధానికి ఇచ్చిన ఫిర్యాదు కారణంగా గాంధీ ఈడీ నుండి జీఎస్టీకి బదిలీ అయ్యారు. ఇక, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ కాగానే..గాంధీ పైన సీబీఐ దాడులు జరిగాయి. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గాంధీకి ఇచ్చిన షాక్గా చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు గట్టి దెబ్బగానే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు అ్యతంత సన్నిహితులు ఇతర కీలక శాకల్లో ఉన్న అధికారుల పైన కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.