టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ఇళ్లలో సీబీఐ సోదాలు- ట్రాన్స్ట్రాయ్ రుణాల ఎగవేతపై
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులపై ఇవాళ సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. గుంటూరులోని రాయపాటి నివాసం, ఆఫీసుల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు తీసుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ దివాలా తీసింది. ఈ వ్యవహారంలో సీబీఐ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. వీటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు గతంలో ఆస్తుల వేలం నోటీసులు కూడా జారీ చేసింది.
ట్రాన్స్ట్రాయ్ సంస్ధకు సీఈవోగా పనిచేసిన శ్రీధర్ అనే్ వ్యక్తి మోసం చేశాడంటూ రాయపాటి కుటుంబ సభ్యులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.300 కోట్ల రూపాయల రుణాలను ట్రాన్స్ట్రాయ్ బ్యాంకులకు బాకీ పడినట్లు తెలుస్తోంది. దీనిపై గతంల రెండుసార్లు సీబీఐ దాడులు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా మరో విడత సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.