సంచలనం:కాకినాడలోని సానా సతీష్బాబు గెస్ట్హౌస్లో...సీబీఐ ఢిల్లీ బృందం సోదాలు
కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోవ్యాపారవేత్త సానా సతీష్ కి చెందిన గెస్ట్ హౌస్ లో సిబిఐ అధికారులు సోదాలు చేయడం సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం ఇక్కడకు చేరుకున్న సిబిఐ ప్రత్యేక బృందం ఈ తనిఖీలు నిర్వహించింది.
కేవలం గెస్ట్ హౌస్ లోనే కాకుండా కాకినాడ,సామర్లకోట,పెద్దాపురంలోని సానా సతీష్ బాబు బంధువుల నివాసాల్లోనూ సిబిఐ అధికారులు సోదాలు జరిపారని తెలిసింది. ఇటీవల దేశాన్ని కుదిపేసిన సిబిఐ సంస్థ వివాదం నేపథ్యంలోనే సానా సతీష్బాబుకు చెందిన అతిధిగృహంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపినట్లు భావిస్తున్నారు. అయితే ఈ సోదాల్లో సిబిఐ అధికారులకు కీలక సమాచారం లభించిందా? లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజాగా కాకినాడలో సోదాలు జరిపిన సిబిఐ బృందం ఢిల్లీ సిబిఐ కార్యాలయం నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ గా తెలుస్తోంది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య విభేదాల నేపథ్యంలో...వారిరువురికి వేర్వేరు వాంగ్మూలాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన సానా సతీష్ బాబు...ఈ వివాదం నేపథ్యంలో సిబిఐ దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిసింది.
ఇక సానా సతీష్ బాబు పూర్వాపరాల విషయాని కొస్తే...ఈయన ఫిర్యాదుతోనే సీబీఐ అడిషనల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదైందని అంటున్నారు. కాకినాడ వాసి అయిన సానా సతీష్ పూర్వాశ్రమంలో కొంత కాలంపాటు విద్యుత్ శాఖలో చిరుద్యోగిగా పని చేశారట. ఆ తరువాత టీడీపీ, వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులతో పరిచయాలు ఏర్పడటంతో...వ్యాపారం కోసమంటూ ఉద్యోగం మానేసి హైదరాబాద్కు మకాం మార్చారని తెలిసింది.
అనంతర కాలంలో ప్రముఖ వ్యాపారిగా ఎదిగిన సానా సతీష్...రస్మా ఎస్టేట్స్ ఎల్ఎల్పీ, గోల్డ్కోస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఏఎస్ మెరైన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలకు సతీశ్ బాబు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్ గ్రూప్ కంపెనీల్లోనూ తొలినాళ్లలో సతీశ్ బాబు డైరెక్టర్గా పని చేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు 24 కంపెనీల్లో ఆయన డైరెక్టర్గా పని చేశారపి తెలిసింది.