కారణమిదే: ఏలూరులో యూపీ అధికారి రాంప్రసాదరావు ఇంటిపై సిబీఐ దాడులు
యూపీకి చెందిన అధికారి ముత్యాల రాంప్రసాదరావు ఏలూరులోని ఇంటిపై సిబిఐ దాడులుఏపీ రాష్ట్రంలోని పలుచోట్ల సీబీఐ అధికారుల తనిఖీలుఅక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు
ఏలూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ముత్యాల రాంప్రసాదరావు నివాసంపై సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు..
ముత్యాల రాంప్రసాదరావు గతంలో ఎన్టీపీసీలో విజిలెన్స్ అధికారిగా పని చేశారు. అప్పట్లో బొగ్గు కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలు చూసే వారు. అప్పట్లో భారీ ఎత్తున అక్రమార్జన చేసినట్లు ఆరోపణలున్నాయి.
రోజుకు కోటి రూపాయలు చొప్పున అక్రమ ఆదాయం వచ్చేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ పక్కా ప్రణాళికతో తనిఖీలకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
విశాఖకు చెందిన 15 మంది సీబీఐ అధికారులు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు చేరుకున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి.. రాంప్రసాదరావు భార్య కనకదుర్గ నివాసంతో పాటు పలు చోట్ల తనిఖీలు చేశారు.
ఉదయం నుంచి కనకవర్ష నగర్లోని ఇంటితోపాటు పట్టణంలోని పలుచోట్ల సోదాలు చేపట్టారు. రాంప్రసాదరావు సొంతూరు పెనుగొండ కావడంతో అక్కడ కూడ ఒక బృందం వెళ్లి తనిఖీలు చేసింది. మరో 4 రోజులు పాటు ఈ తనిఖీలు కొనసాగుతాయని సమాచారం.
సిబీఐ అధికారుల సోదాలు విషయం తెలుసుకొన్న బినామీలు జాగ్రత్తపడుతున్నారని ప్రచారం సాగుతోంది. రాంప్రసాద్రావుకు చెందిన సన్నిహితులు బినామీలతో వ్యాపారం చేయిస్తారని తొలి నుంచీ ఆరోపణలున్నాయి. కనకదుర్గ వద్ద సహాయకుడుగా పనిచేస్తున్న ముఖ్యుడొకరిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి ద్వారా కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. తనిఖీల సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.