సీబీఐ రివర్స్ షాక్: నర్సీపట్నం డాక్టర్ సుధాకర్పైనా కేసులు నమోదు: పలు సెక్షన్ల కింద
విశాఖపట్నం: విశాఖపట్నం రూరల్ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ కేసులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు రివర్స్ షాక్ ఇచ్చారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పైనా కేసులు నమోదు చేశారు. ఆయనపై సీబీఐ అధికారులు ఒకటికి మించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్ సుధాకర్ కేసులో ఇప్పటికే ఆయనకు వైద్యాన్ని అందజేస్తోన్న డాక్టర్ రామిరెడ్డిని విధుల నుంచి తప్పించిన సీబీఐ అధికారులు రెండో విడతలో ఏకంగా డాక్టర్ సుధాకర్పైనే కేసులు నమోదు చేయడం సంచలనం రేపుతోంది.
డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ తొలి వేటు: స్లో పాయిజన్: డాక్టర్పై: వైసీపీ సానుభూతిపరుడిగా
తొలుత డాక్టర్పై..ఆ వెంటనే డాక్టర్ సుధాకర్పై..
ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు కిందటి వారమే విచారణ ఆరంభించారు. దూకుడు పెంచారు. విచారణ ఆరంభించిన రెండో రోజే డాక్టర్ సుధాకర్కు చికిత్స అందిస్తోన్న డాక్టర్ రామిరెడ్డిని బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు. ఆ చర్య తీసుకున్న కొద్దిరోజుల్లోనే అనూహ్యంగా డాక్టర్ సుధాకర్పైనే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగి అయివుండీ..
ప్రభుత్వ ఉద్యోగి అయివుండీ నడి రోడ్డు మీద అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులను దూషించడం వంటి చర్యల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, అరెస్టు సమయంలో ఉద్దేశపూరకంగా పోలీసులపై విమర్శలు చేశారనే ఆరోపణల కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో రోడ్డు మీదికి రావడాన్ని కూడా సీబీఐ అధికారులు తప్పు పట్టారని అంటున్నారు.
లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కూడా..
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘన కింద ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టంలోని సెక్షన్ 188 కింద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో విశాఖపట్నం ఫోర్త్టౌన్ పోలీసులు, మానసిక ఆసుపత్రి సిబ్బందిని వారు విచారించారు. దీనిపై ఓ నివేదికను రూపొందించినట్లు సమాచారం. సీబీఐ అధికారులు ఈ కేసును తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ముందు జరిగిన అంశాలన్నింటితో కూడిన ఓ సీడీని ఫోర్త్టౌన్ పోలీసులు సీబీఐ అధికారులకు అందజేశారని అంటున్నారు.
విశాఖ పోలీసుల నుంచి పూర్తి సమాచారం..
డాక్టర్ సుధాకర్ అరెస్టుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన వీడియో క్లిప్పింగులు, మీడియాలో వచ్చిన కథనాలు, కొన్ని ఫొటోలు, అప్పటిదాకా ఫోర్త్టౌన్ పోలీసులు కొనసాగించిన దర్యాప్తు వివరాలు వంటి అంశాలన్నీ ఈ సీడీలో పొందుపరిచినట్లు చెబుతున్నారు. ఈ కేసుతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటిదాకా 23 మందిని విచారించినట్లు తెలుస్తోంది. డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులు, మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధారాణి, ఇతర సిబ్బంది, పోలీసులు, ప్రత్యక్ష సాక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. తాము విచారించిన అంశాలు, పోలీసులు అందజేసిన సీడీలోని విషయాలను క్రోడీకరించి, దర్యాప్తు సాగిస్తున్నారు సీబీఐ అధికారులు
హైకోర్టు ఆదేశాలతో..
దళితుడైన డాక్టర్ సుధాకర్ను ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఇబ్బందులకు గురి చేసిందని, ఆయనను మానసికంగా వేధింపులకు గురి చేసి, పిచ్చివాడిగా మార్చిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించింది. ఎనిమిది వారాల్లోగా నివేదిక అందించాలని ఆదేశంచింది.