దాసరి కుట్రదారుడే: కోల్ గేట్పై కోర్టు ముందు సిబిఐ
న్యూఢిల్లీ : రెండు జిందాల్ గ్రూప్ కంపెనీలకు బొగ్గు బ్లాకు కేటాయించేందుకు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మాజీ బొగ్గుగనుల శాఖ సహాయమంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా తదితరులు కుట్రపన్నారని ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ నివేదించింది.
జిందాల్ గ్రూప్ కంపెనీలైన జిందాల్ స్టీల్ అండ్ పవర్, గగన్ స్పాంజ్ ఐరన్లకు అమరకొండా ముర్గాదంగల్ బ్లాకు కేటాయించేందుకు అందరూ కలిసి కుట్రపన్ని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని సీబీఐ తెలిపింది. దాసరి, జిందాల్, కోడాతో సహా మొత్తం 11 మందిపై అభియోగపత్రం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
జిందాల్, దాసరి తరఫు న్యాయవాదులు కోర్టులో సీబీఐ వాదనలను వ్యతిరేకించారు. అప్పట్లో కేంద్ర బొగ్గుశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న తన క్లయింటుకు జార్ఖండ్ సర్కారు నిర్ణయంతో ఎలాంటి సంబంధం లేదని దాసరి తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించారు.
కేటాయింపు జరిపిన స్క్రీనింగ్ కమిటీ నిర్ణయంలో దాసరి ప్రమేయం లేదని, పైగా అప్పట్లో బొగ్గుశాఖను నేరుగా నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్ తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
సహాయ మంత్రిగా బొగ్గు బ్లాకుల కేటాయింపులో దాసరి నారాయణ రావు పాత్ర లేదని, స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినందున దాసరి నారాయణ రావు కుట్రలో భాగస్వామిగా లేరని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు.